కులాలవారీగా కాకుండా ప్రతి పేదోడికి పేద బంధు ఇవ్వాలని ఎమ్మెల్యే ఈటల రాజేందర్ డిమాండ్ చేశారు. మునుగోడు నియోజకవర్గం చౌటుప్పల్ మండలంలో బీజేపీ అభ్యర్థి రాజగోపాల్ కు మద్దతుగా ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కేసీఆర్ పై విరుచుకుపడ్డారు. సీఎం ప్రజలను తాగుబోతులను చేస్తున్నారని మండిపడ్డారు.
లిక్కర్ పై ఏడాదికి రూ.45 వేల కోట్ల ఆదాయం వస్తోందని.. కానీ, పింఛన్లు, కల్యాణ లక్ష్మీ, రైతు బంధు పథకాలకు తక్కువగానే ఖర్చు పెడుతున్నారని ఆరోపించారు. ప్రజలు సుపరిపాలన కోసం ఓటు వేశారే తప్ప.. బెల్టు షాపులు పెట్టి మహిళల పుస్తెలు తెంచేందుకు కాదని అన్నారు. గ్రామాలలో బెల్టు షాపులు పెట్టించి 30ఏండ్లకే యువత మరణానికి కేసీఆర్ కారణమవుతున్నారని ఫైరయ్యారు.
రాష్ట్రాన్ని పూర్తిగా అప్పులపాలు చేసిన ఘనత ముఖ్యమంత్రికే దక్కుతుందని విమర్శించారు రాజేందర్. మంత్రులను పంపి ప్రజలకు మద్యం తాగించే నీచమైన సీఎంని ప్రపంచంలో ఎక్కడా చూడలేదని మండిపడ్డారు. ఒకవైపు వందల ఎకరాలు ఉన్నవారికి రైతు బంధు ఇస్తే బెంజి కార్లలో వచ్చి డబ్బులు తీసుకుపోతున్నారని.. మరోవైపు పంట ఎండిపోయి కౌలురైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
ఇక రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ… కేసీఆర్ కుటుంబానికి, నాలుగు కోట్ల ప్రజలకు మధ్య జరుగుతున్న పోరాటంలో మునుగోడు జనం చారిత్రాత్మక తీర్పు ఇవ్వాలని కోరారు. రాష్ట్రంలో ఉన్న ఏ ఎమ్మెల్యే కూడా కొట్లాడని విధంగా అసెంబ్లీలో మూడున్నరేండ్లుగా కొట్లాడానని.. అయినా అభివృద్ధికి కనికరించలేదని ఆరోపించారు. మునుగోడు ఉప ఎన్నిక భారతదేశ చరిత్రలో నిలిచిపోయే ఎన్నిక అని వ్యాఖ్యానించారు.