తెలంగాణ ప్రభుత్వం అనేక తప్పులను.. గవర్నర్ ద్వారా ప్రసంగం చేయించారని కీలక వ్యాఖ్యలు చేశారు ఎమ్మెల్యే ఈటెల రాజేందర్. శుక్రవారం ఆయన అసెంబ్లీలో మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ.. కేసీఆర్ సర్కార్ 24 గంటలు కరెంట్ ఇస్తున్నామనేది శుద్ధ తప్పని తేల్చి చెప్పారు. ఆరు గంటలు కూడా కరెంట్ రావట్లేదని రైతులు సబ్ స్టేషన్ల వద్ద ఆందోళన చేస్తున్నారన్నారు.
రైతులకు 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదంటూ సాక్షాత్తు ప్రభాకర్ రావు తెలిపారన్న విషయాన్ని గుర్తు చేశారు. గవర్నర్ ప్రసంగంలో అనేక అబద్దాలు ఉన్నాయి. ప్రసంగంలో ధరణి ప్రస్తావన లేదన్నారు. ప్రభుత్వం ఇచ్చిన ప్రతి మాత్రమే గవర్నర్ చదివారన్నారు.
ధరణితో అనేక మంది ఇబ్బందులకు గురవుతున్నారని మండిపడ్డారు. కేంద్ర నిధులతో మాత్రమే అర్బన్ ప్రాంతంలో డబుల్ బెడ్ రూమ్ ఇల్లులు నిర్మించారన్నారు. గజ్వేల్, సిద్దిపేట తప్ప ఎక్కడా డబుల్ బెడ్ రూమ్ ఇల్లులు నిర్మించలేదని ఆరోపించారు.
ధరణి, డబుల్ బెడ్ ఇళ్లు రాక పలువురు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. గొప్పలు చెప్పుకోడానికి మాత్రమే పనికి వచ్చే ప్రసంగమంటూ తీవ్ర విమర్శలు చేశారు ఈటెల రాజేందర్.