టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడైన సింహయాజి బెయిల్ పై చంచల్ గూడ జైలు నుంచి విడుదలయ్యారు. నిజానికి వారం రోజుల క్రితమే హైకోర్టు సింహయాజికి బెయిల్ మంజూరు చేసింది. కానీ ఆయన బుధవారం జైలు నుంచి విడుదలయ్యారు. ష్యూరిటీల అంశంలో జాప్యం జరగడంతో రిలీజ్ ఆలస్యమైంది. నాంపల్లి ఏసీబీ ప్రత్యేక కోర్టులో రూ.6 లక్షల పూచీకత్తుతో పాటు ఇద్దరి జామీను సమర్పించారు సింహయాజీ తరఫు లాయర్. దీంతో ఆయనను చంచల్గూడ జైలు నుంచి రిలీజ్ చేశారు అధికారులు. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడేందుకు సింహయాజీ నిరాకరించారు.
ఇదే కేసులో మరో ఇద్దరు నిందితులైన రామచంద్ర భారతి, నంద కుమార్ ఇంకా జైల్లోనే ఉన్నారు. రామచంద్రభారతి, నందకుమార్ ష్యూరిటీలను కోర్టు బుధవారం పరిశీలించనుంది. ష్యూరిటీలను ఆమోదించిన తర్వాత బెయిల్ ఆర్డర్స్ జైలుకు చేరనున్నాయి. ఆ తర్వాత ఈ ఇద్దరూ రిలీజ్ అవుతారు.
మరోవైపు ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ కు నాంపల్లి ఏసీబీ కోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్, కేరళకు చెందిన తుషార్, జగ్గుస్వామి, లాయర్ శ్రీనివాస్ను నిందితులుగా చేర్చేందుకు కోర్టు నిరాకరించింది. ఈ కేసును దర్యాప్తు చేసే అధికారం సిట్కి లేదని ఏసీబీ స్పెషల్ కోర్టు జడ్జి జీ రాజగోపాల్ తేల్చి చెప్పారు. ప్రివెన్షన్ ఆఫ్ కరప్షన్ యాక్ట్ (పీసీ యాక్ట్) గ్రౌండ్లో సిట్ దాఖలు చేసిన మెమోను తిరస్కరించారు.
పీసీ యాక్ట్ కేసుల్లో ఏసీబీకి మాత్రమే దర్యాప్తు అధికారం ఉందని, లా అండ్ ఆర్డర్ పోలీసులకుగానీ, సిట్కుగానీ ఇన్వెస్టిగేషన్ చేసే అధికారం లేదని స్పష్టం చేశారు. బీఎల్ సంతోష్, తుషార్, జగ్గుస్వామి, శ్రీనివాస్ను నిందితులుగా చేర్చాలంటూ గత నెల 22న సిట్ అధికారులు ఏసీబీ కోర్టులో మెమో ఫైల్ చేశారు. మంగళవారం విచారణ చేపట్టిన కోర్టు ఆ మెమోను రిజెక్ట్ చేసింది.