దుబ్బాకలో తనని ఓడగొట్టేందుకు ప్రచారం చేస్తామని మంత్రి కేటీఆర్ చెప్పడం హాస్యాస్పదమని పేర్కొన్నారు ఎమ్మెల్యే రఘునందన్ రావు. నియోజకవర్గంలోని చెల్లాపూర్ వార్డులో ‘ప్రజా గోస – బీజేపి భరోసా’ కార్నర్ సమావేశంలో రఘునందన్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి కేటీఆర్ కు ఎమ్మెల్యే సవాల్ విసిరారు.
నియోజకవర్గంలోని ప్రతి దళిత కుటుంబానికి దళిత బంధు, సొంత జాగలో ఇల్లు నిర్మించుకునే వారికి ఏడున్నర లక్షలు మంజూరు చేస్తే .. తాను వచ్చే ఎన్నికల్లో పోటీ చేయనని స్పష్టం చేశారు. తనని ఓడగొట్టడానికి జిమ్మిక్కులు అవసరం లేదన్నారు రఘునందన్ రావు.
దమ్ముంటే ఈ రెండు పథకాలను దుబ్బాకలో అమలు చేయాలని మంత్రి కేటీఆర్ ను డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి ఎనిమిది సంవత్సరాలు గడిచినా చెల్లాపూర్ వార్డులో ఇళ్లు లేని నిరుపేదలకు ఒక్క డబుల్ బెడ్రూమ్ కూడా కట్టించలేదని ఆరోపించారు ఎమ్మెల్యే రఘునందన్ రావు.