ప్రభుత్వం నిధులివ్వకపోవడంతో వారు ఆత్మహత్య చేసుకుంటున్నారని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ప్రగతి భవన్ ముందు ఓ సర్పంచ్ కుటుంబంతో కలిసి ఆత్మహత్యాయత్నం చేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ప్రతిపక్ష ఎమ్మెల్యేల నియోజకవర్గాల అభివృద్ధికి నిధులిచ్చే విషయంలో రాష్ట్ర ప్రభుత్వం వివక్ష చూపుతోందని రఘునందన్ రావు ఆరోపించారు.
స్పెషల్ డెవలెప్మెంట్ స్కీం కింద గజ్వేల్ కు రూ.890 కోట్లు, సిద్ధిపేటకు రూ.790కోట్ల నిధులు ఇచ్చిన సీఎం కేసీఆర్.. దుబ్బాక నియోజకవర్గానికి ఒక్క రూపాయి కూడా ఇవ్వకుండా వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. భాగ్యనగరంలో పేదలకు ప్రభుత్వం డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వడం లేదని రఘునందన్ అన్నారు.
ఇంటి నిర్మాణానికి గతంలో రూ.5లక్షలు ఇస్తామన్న ప్రభుత్వం ఇప్పుడు దాన్ని రూ.3లక్షలకు తగ్గించిందని, అసలు సొంత జాగా ఉన్నోళ్లకు ఆర్థిక సాయం ఎప్పుడిస్తారని ప్రశ్నించారు. 2019లో నిరుద్యోగ భృతి ఇస్తామని ప్రకటించినా ప్రభుత్వం మూడేళ్లైనా ఇంకా అమలు చేయలేదని గుర్తు చేశారు. ట్రైబల్ యూనివర్సిటీకి కేంద్రం నిధులిచ్చినా రాష్ట్ర ప్రభుత్వం భూమి కేటాయించడంలేదని ఆరోపించారు.
వడ్ల కొనుగోలు విషయంలో కేసీఆర్ సర్కారు కేంద్రాన్ని బద్నాం చేస్తోందని, ఈ విషయంలో మోడీ ప్రభుత్వం అన్ని విధాలా సహకరిస్తోందని రఘునందన్ స్పష్టం చేశారు. ఐదింటిలో మూడు ఈవెంట్లలో పాసైన ఎస్సై, కానిస్టేబుల్ అభ్యర్థులకు మెయిన్స్ కు అనుమతించడంతో పాటు కటాఫ్ మార్కుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం పునరాలోచాలని కోరారు.