బీజేపీ డిసిప్లీనరీ కమిటీ ఇచ్చిన నోటీసులకు ఎమ్మెల్యే రాజాసింగ్ వివరణ ఇచ్చారు. క్రమ శిక్షణ కలిగిన బీజేపీ కార్యకర్తగా తాను పార్టీ సిద్దాంతాలకు కట్టుబడి ఉంటానని కమిటీకి తెలిపారు. ఈ మేరకు డిసిప్లీనరీ కమిటీకి ఓ లేఖ రాశారు.
పార్టీ క్రమశిక్షణా నిబంధనలను తాను ఎక్కడా ఉల్లంఘించలేదన్నారు. తాను ఏ మతాన్ని కించపర్చలేదని వెల్లడించారు. మునావర్ ఫారుఖీ షో సందర్భంగా తాను రిలీజ్ చేసిన వీడియోపై టీఆర్ఎస్, మజ్లీస్ నేతలు కలిసి తప్పుడు కేసులు పెట్టారని ఆయన పేర్కొన్నారు.
అందుకే ఆ కేసును న్యాయస్థానం డిస్మిస్ చేసిందన్నారు. తాను కేవలం మునావర్ ఫారుఖీని మాత్రమే ఇమిటేట్ చేశానన్నారు. తాను ఏ మతాన్ని, వ్యక్తిని కించపరిచేలా వ్యాఖ్యలు చేయలేదన్నారు. టీఆర్ఎస్, ఎంఐఎం దురాగతాలపై తాను అలుపెరగని పోరాటం చేస్తున్నట్టు పేర్కొన్నారు.
ఎంఐఎం విధానాలను ప్రశ్నిస్తే ముస్లింలను తిడుతున్నట్లుగా తన వ్యాఖ్యలను వక్రీకరించారన్నారు. తనపై వందకు పైగా కేసులు పెట్టారని చెప్పారు. మునావర్ ఫారుఖీ షో సందర్బంగా తనతో పాటు 5 వందల మంది బీజేపీ కార్యకర్తలను పోలీసులు అరెస్ట్ చేశారని తెలిపారు. తానెక్కడా నిబంధనలను ఉల్లంఘించలేదన్నారు. పార్టీలో కొనసాగుతూ బీజేపీకి, దేశానికి సేవ చేసే అవకాశాన్ని తనకు ఇవ్వాలని లేఖలో కోరారు.