నిజాంను తరిమికొట్టిన తెలంగాణ సమాజం.. కేసీఆర్ ను తరిమికొట్టే రోజు దగ్గర్లోనే ఉందన్నారు ఎమ్మెల్యే రాజాసింగ్. ఎంపీ అరవింద్ పై టీఆర్ఎస్ శ్రేణులు చేసిన దాడిని ఆయన ఖండించారు. ప్రజాప్రతినిధిగా ప్రజల్లోకి వెళ్లడం రాజ్యాంగం కల్పించిన హక్కని గుర్తు చేశారు. రాష్ట్రంలో రాజ్యాంగాన్ని పక్కనబెట్టి టీఆర్ఎస్ అధినేత ఇతర పార్టీల నేతలను భయపెట్టాలని చూస్తున్నారని మండిపడ్డారు.
రాష్ట్రంలో ప్రభుత్వం శాంతి భద్రతలను పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు రాజాసింగ్. టీఆర్ఎస్ నాయకుల అవినీతి, అక్రమాలు నిత్యకృత్యమయ్యాయని ఆరోపించారు. దాడులకు పాల్పడుతున్న టీఆర్ఎస్ కార్యకర్తలను పోలీసులు పట్టించుకోకుండా ఉండడం దారుణమన్నారు. పైగా దాడులు వాళ్లు చేస్తే… బీజేపీ కార్యకర్తలపై కేసులు నమోదు చేయడం దురదృష్టకరమని మండిపడ్డారు.
ఈ దాడుల వెనుక ముఖ్యమంత్రి కుట్ర ఉందనేది స్పష్టంగా అర్థం అవుతోందన్న రాజాసింగ్.. రాజకీయంగా బీజేపీని ఎదుర్కోలేక ఇలా చేస్తున్నారని విమర్శించారు. హుజూరాబాద్, దుబ్బాక, గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల్లో వరుసగా ప్రజలు టీఆర్ఎస్ ను వ్యతిరేకించడంతో బీజేపీ కార్యకర్తలపై దాడులు చేసి.. పోలీసులతో కేసులు నమోదు చేయించి జైలుకు పంపించడం ద్వారా కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
ఎంఐఎం మిత్రపక్షం అని చెప్పుకుంటున్న ముఖ్యమంత్రి.. వారి వారసత్వంగా వచ్చిన నియంతృత్వాన్ని ప్రత్యక్షంగా బీజేపీ కార్యకర్తలు, నాయకులపై చూపిస్తున్నారని మండిపడ్డారు. నిజాం మహారాజు అన్న కేసీఆర్ వారి ఆలోచనా విధానాలను అమలు చేస్తున్నారని ఆరోపించారు. దాడులకు పాల్పడ్డ టీఆర్ఎస్ కార్యకర్తలపై కేసు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు రాజాసింగ్.