బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ వర్సెస్ ప్రోటోకాల్ అధికారుల వార్ పీక్స్ కు చేరుకుంటోంది. కండిషన్ లో లేని తన బుల్లెట్ ప్రూఫ్ వాహనాన్ని ప్రగతి భవన్ ముందే తగులబెడతా అని రాజాసింగ్ ఆ వాహనాన్ని ప్రగతి భవన్ దగ్గరే వదిలేశారు. దీంతో తన నియోజక వర్గంలో అభివృద్ధి పనుల కోసం ఆయన బైక్ పై వెళుతున్నారు.
మరో వైపు ప్రోటోకాల్ అధికారులు రాజాసింగ్ వాహనానికి రిపేర్ చేయించారు. కారును తీసుకెళ్లమని ఆయనకు కబురు చేస్తున్నారు. ఆయన మాత్రం తనకు పాత వాహనం వద్దని.. కొత్తది కాకపోయినా పర్లేదు కానీ.. కనీసం కండిషన్ లో ఉన్న వెహికిల్ కావాలని డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ పాత వాహనాన్ని బలవంతంగా అధికారులు తన నివాసం వద్ద వదిలివెళితే.. ప్రగతి భవన్ దగ్గర వాహనాన్ని తగులబెడుతానని రాజాసింగ్ అధికారులకు హెచ్చరించారు.
దీంతో వ్యవహారం ఎమ్మెల్యే రాజాసింగ్ వర్సెస్ ప్రోటోకాల్ అధికారులుగా మారింది. కాగా తన బండి మొరాయింపులకు సంబంధించి పలుమార్లు ఎమ్మెల్యే రాజాసింగ్ అభ్యర్థించడం జరిగింది. ఇప్పటికే ఈ వాహనం మూడు సార్లు ఆగిపోయి మొండికేసింది. ఈ క్రమంలో తన వాహనాన్ని మార్చాలంటూ కోరినా ఫలితం లేకుండా పోయింది. దీంతో రాజాసింగ్ వినూత్న నిరసనకు తెరదీశారు. ప్రభుత్వం తనకు కేటాయించిన బులెట్ ప్రూఫ్ కారును ప్రగతి భవన్ గేటు దగ్గర వదిలేశారు. పోలీసులు దాన్ని స్వాధీనం చేసుకొని పంజాగుట్ట పోలీస్ స్టేషన్ కు తరలించారు.