పటాన్ చెరు నియోజక వర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ మాజీ ఎమ్మెల్యే వార్ పీక్స్ కు చేరుకుంటోంది. ఎమ్మెల్యేను మాజీ ఎమ్మెల్యే పాపాల రెడ్డి అని నామకరణం చేయగా.. మాజీ మంత్రి పుణ్యమా అని బతకడం లేదా.. అని మాజీ ఎమ్మెల్యేకు, ఎమ్మెల్యే కౌంటర్ వేశారు. దీంతో ఇప్పుడు వారి మధ్య మాటల యుద్ధం తారస్థాయికి చేరుకుంది.
పటాన్ చెరు ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి పై మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్ నిప్పులు చెరిగారు. ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి.. పాపాల రెడ్డిగా మారారంటూ విమర్శించారు. 2014 ఎన్నికల్లో అఫిడవిట్ లో 2 కోట్లు చూపించిన ఎమ్మెల్యే ఇప్పుడు 2 వేల కోట్లకు ఎదిగాడని ఆరోపించారు. వచ్చే ఎన్నికల్లో ఓటుకు 20 నుంచి 30 వేలు ఇచ్చి కొనాలని చూస్తున్నారంటూ ఆరోపించారు.
దమ్ముంటే కేసీఆర్ ముందస్తుకు రావాలని సవాల్ చేశారు. శివరాత్రి జాగరణ పేరుతో సినీ ఆర్టిస్టులతో హిందూ ధర్మాన్ని అపహాస్యం చేశారని మండిపడ్డారు. పాపాలరెడ్డి పై తర్వలోనే కేంద్ర ప్రభుత్వం విచారణ జరిపి చర్యలు తీసుకోవడం ఖాయమన్నారు బీజేపీ నేత, మాజీ ఎమ్మెల్యే నందీశ్వర్ గౌడ్.
ఇక దీనికి కౌంటర్ గా..’1987 లో ఏ గుర్తింపు లేని నువ్వు మాజీ మంత్రి పి.రామచంద్రారెడ్డి పుణ్యంతో బతికావని.. మీ ఆఫీసును మీరే తగల పెట్టించుకొని, నక్సలైట్ల దాడి జరిగిందని, నక్సలైట్ల హిట్ లిస్టులో ఉన్నానని నాటకాలాడి గన్ మెన్లను పెట్టుకోలేదా’ అని ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి అన్నారు. రాబోయే ఎన్నికల్లో నందీశ్వర్ గౌడ్ కే టికెట్ ఇవ్వాలని బండి సంజయ్ ని బ్రతిమిలాడుతానని.. తనకు టికెట్ ఇవ్వకున్నా..నందీశ్వర్ ఓటమికి ఇల్లిల్లూ తిరుగుతానని ఆయన అన్నారు. మొత్తానికి వీరిద్దరి మాటల యుద్ధంలో పటాన్ చెరు నియోజక వర్గంలో అప్పుడే ఎన్నికల వేడి పుట్టినట్టుంది.