టీడీపీ నేత, విజయవాడ ఎంపీ కేశినేని నానిపై ఆ పార్టీకే చెందిన ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేశారు. గతంలోనే ఉన్న ఇరువురి నేతల మధ్య వైరం ముదిరింది. తాజాగా కేశినేని నాని వ్యతిరేక వర్గం సమావేశం అయ్యింది. ఆ పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు బొండా ఉమా నివాసంలో సమావేశమైన నేతలు… ఎంపీ నానిపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు.
ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న మాట్లాడుతూ… గత కొన్ని రోజులుగా ఎంపీ కేశినేని నానితో విసిగిపోయి మీడియా ముందుకు వచ్చామన్నారు. తమకెంతో బాధగా ఉందని, చంద్రబాబును ఏక వచనంతో సంబోధించడం, చిటికెలు వేసి విజయవాడకు తానే అధిష్టానం అనడం ఆయన అహంకారానికి నిదర్శనమన్నారు. కేశినేని నానిని ఆరోజే చెప్పుతో కొట్టేవాడిని.. చంద్రబాబు మీద గౌరవంతో వదిలేశానన్నారు.
నీ స్థాయి దాటి వ్యవహరిస్తున్నావు.. దమ్ముంటే రా నువ్వో నేనో తేల్చుకుందాం అంటూ కేశినేనికి బుద్ధా సవాల్ విసిరాడు. రంగా హత్య కేసులో ముద్దాయిని ఎన్నికల ప్రచారంలో తిప్పుతున్నాడని, టీడీపీకి బీసీలను దూరం చేసే ప్రయత్నం చేస్తున్నాడని ఆరోపించారు.