తెలంగాణ రాష్ట్రంలో రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైందని వ్యాఖ్యానించారు ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి. కరీంనగర్ ఆర్ అండ్ బి గెస్ట్ హౌస్ లో రాష్ట్ర ప్రభుత్వం తీరుపై ఆయన మండిపడ్డారు. రైతులను ఆదుకుంటున్నామని అంటూనే నట్టేట ముంచే ప్రయత్నం చేస్తున్నారని ఆరోపించారు. ఓ చేతితో ఇస్తూ.. ఇంకో చేతితో లాక్కుంటున్నారని ఆరోపించారు.
రైతుబంధు రూపంలో ఇచ్చి.. అన్ని రకాల ప్రోత్సహకాలను రద్దు చేస్తున్నారని మండిపడ్డారు. విత్తనలపై రాయితీ, యంత్రాలపై ఇచ్చే సబ్సిడీ, ఉద్యాన పంటలకు ఇచ్చే డ్రిప్ పరికరాలను ఆపేసిందని అన్నారు. కేంద్రం ఉద్యానవన శాఖకు విడుదల చేసే నిధులకు మ్యాచింగ్ గ్రాంట్ రాష్ట్ర ప్రభుత్వం చెల్లించకపోవడంతో ఆ నిధులు తిరిగి వెళ్లిపోతున్నాయన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం పంటల బీమా అమలు చేయడంలో నిర్లక్ష్యం వహించిందని.. అకాల వర్షాలతో పంటలు దెబ్బతిన్న రైతులకు పరిహారం అందకుండా పోతోందని విరుచుకుపడ్డారు. రాష్ట్ర ప్రభుత్వం అస్పష్ట విధానాలతో 50 లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం దిగుబడి తగ్గిందని.. దీంతో రూ.10వేల కోట్ల ఆదాయాన్ని రైతులు కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు.
రైతులకు ఋణ మాఫీ రూ.2 లక్షలు ఇవ్వడం వల్ల కాస్త ఊరట కలుగుతోందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే వ్యవసాయ ఉత్పత్తులకు మద్దతు ధర కల్పిస్తామని హామీ ఇచ్చారు. గతంలో మాదిరిగా వ్యవసాయ అనుబంధ రంగాలకు సబ్సిడీ అందిస్తామని పేర్కొన్నారు. పంటలకు బీమా పథకం అమలు చేస్తామని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల విధానాలతో వరి ధాన్యం సేకరణ పట్ల రైతాంగం ఆందోళనకు గురవుతోందని రాష్ట్ర ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు జీవన్ రెడ్డి.