ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో కవిత గురువారం మరోసారి ఈడీ ముందు హాజరుకానున్నారు. మార్చి 11వ తేదీన ఒకమారు ఆమె ఈడీ ముందు హాజరయ్యారు. మార్చి 11 వ తేదీ ఉదయం 11 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు ఈడీ అధికారులు ఆమెను విచారించారు. సుదీర్ఘంగా ఈ విచారణ జరిగింది.
కాగా, గురువారం మరోసారి ఈడీ విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఎలాంటి ప్రశ్నలు వేస్తారనే దానిపై ఆసక్తి నెలకొన్నది. మార్చి 11వ తేదీన విచారణ సందర్భంగా కవిత సెల్ఫోన్ను ఈడీ అధికారులు సీజ్ చేశారు. ఈడీ విచారణపై ఇప్పటికే కవిత సుప్రీంకోర్టు మెట్లు ఎక్కారు. ఈడీ తనను వేధిస్తోందని ఆరోపించారు.
కాగా, ఈ కేసు విచారణను సుప్రీంకోర్టు మార్చి 24వ తేదీకి వాయిదా వేసింది. అయితే, గురువారం మరికొన్ని కీలకమైన విషయాలపై ప్రశ్నించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాను కవిత బినామీగా పేర్కొన్న రామచంద్ర పిళ్లైతో కలిసి కవితను ప్రశ్నించే అవకాశం ఉన్నట్లుగా అధికారిక వర్గాలు చెబుతున్నాయి. గురువారం ఏం జరుగుతుందనే దానిపై ఉత్కంఠత నెలకొన్నది.
ఢిల్లీ లిక్కర్ స్కామ్కేసులో సీబీఐ అధికారులు ఇప్పటికే హైదరాబాద్లో కవితను విచారించారు. కీలక విషయాలను రికార్డ్ చేశారు. ఈ కేసులో ఇప్పటికే 11 మందిపై అభియోగాలు మోపబడ్డాయి. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో సహా పలువురికి ఈడీ అరెస్ట్ చేసింది. మరిన్ని అరెస్ట్లు ఉండే అవకాశం ఉంటుందని ఇప్పటికే ప్రచారం జరుగుతుంది.
దీంతో ఈసారి ఏం జరగనుందోనని బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్కంఠ నెలకొంది. కవితకు ధైర్యం చెప్పేందుకు గాను ఆమె అన్న, మంత్రి కేటీఆర్ ఇప్పటికే ఢిల్లీ బయల్దేరి వెళ్లారు. ఢిల్లీలోని న్యాయవాదులతో కవిత, కేటీఆర్ చర్చించినట్లు తెలిసింది. అవసరమైన న్యాయసలహాలు, సూచనలు తీసుకున్నట్లు సమాచారం. ఈడీ విచారణ 11 గంటలకు మెుదలు కానుండగా.. 10 గంటలకు కవిత ప్రెస్ మీట్ పెట్టనున్నారు. ప్రెస్ మీట్లో కవిత ఏం మాట్లాబోతున్నారనేది కూడా ఆసక్తిగా మారింది.