టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత చెన్నైలో పర్యటిస్తున్నారు. ప్రముఖ ఆంగ్ల పత్రిక నిర్వహించనున్న సదస్సుల్లో పాల్గొనేందుకు ఆమె చెన్నైకి వెళ్లారు.
చెన్నైలో ప్రముఖ సినీ హీరో అర్జున్ సర్జ నిర్మించిన హనుమాన్ దేవాలయాన్ని కవిత సందర్శించారు. దైవ దర్శనం చేసుకుని అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఆలయానికి వచ్చిన కవితకు అర్జున్ దంపతులు ఘనస్వాగతం పలికారు.
ఈ సందర్భంగా మీడియాతో కవిత మాట్లాడారు. చెన్నైలో పర్యటించడం తనకు ఎప్పుడూ ఆనందంగా ఉంటుందని వెల్లడించారు. తమిళనాడు అస్తిత్వం చాలా గొప్పదని ఆమె పేర్కొన్నారు.
తమిళ ప్రజలు చాలా స్ఫూర్తిదాయకంగా ఉంటారని ఆమె చెప్పారు. తమిళ ప్రజలు తమ సంస్కృతి భాష చరిత్ర వారసత్వం పట్ల గర్వంగా ఉంటారని ఆమె తెలిపారు.
ప్రతి ఒక్కరికీ ఆ గౌరవభావం ఉండాలని ఆమె అన్నారు. ఉమ్మడి ఆలోచన తత్వం భారతీయులను ఐక్యంగా ఉంచుతుండడం గర్వంగా ఉందన్నారు.