అతి త్వరలోనే ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేస్తారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్. ఢిల్లీ డిప్యూటీ సీఎం సిసోడియా, ఎమ్మెల్సీ కవితను అరెస్ట్ చేయాలని అధికారులను కోరేందుకు కేఏ పాల్ ఈరోజు సీబీఐ కార్యాలయానికి వెళ్లారు. అయితే ఆదివారం కావడంతో తిరిగి వచ్చారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ఆరు నెలలుగా లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తు జరుగుతుందని.. ఈ కేసు విచారణను సీబీఐ మరింత వేగవంతం చేయాలని డిమాండ్ చేశారు. ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసు దర్యాప్తును వేగవంతం చేసేందుకు సుప్రీంకోర్టును ఆశ్రయిస్తామని కేఏ పాల్ తెలిపారు.
అతి త్వరలోనే ఎమ్మెల్సీ కవితతో పాటు మనీష్ సిసోడియాను సీబీఐ అరెస్ట్ చేస్తుందని చెప్పారు. సిసోసిడియాకు నోటీసులు ఇస్తున్న సీబీఐ.. ఎమ్మెల్సీ కవితను ఎందుకు అరెస్ట్ చేయడం లేదని ప్రశ్నించారు. లిక్కర్ స్కామ్ వెనుక ఎవరున్నారో అందరికి తెలుసన్నారు. ఆలస్యం చేస్తే రాజకీయాలను అంటగడతారని ఆరోపణలు చేశారు కేఏ పాల్.