రాష్ట్రంలో టీఆర్ఎస్ పునాదులు కదులుతున్నాయన్న ఆందోళనలో మంత్రి కేటీఆర్కు తొందరెక్కువైనట్టు కనిపిస్తోందన్నారు బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు. నదీ జలాల పంపకంపై ప్రతినిధుల బృందాన్ని ఏర్పాటు చేయకుండా కేసీఆర్ ప్రభుత్వం ఆలస్యం చేస్తోందని ఆరోపించారు. సుప్రీంకోర్టుకు వెళ్లడం వల్లే కృష్ణా నదీ జలాల పంపకాల్లో జాప్యం జరుగుతోందని వ్యాఖ్యానించారు.
సీఎం కేసీఆర్ వల్లే కృష్ణా జలాల విషయంలో తెలంగాణకు అన్యాయం జరిగిందని ఆరోపించారు. 290 టీఎంసీల నీటి వినియోగానికి అంగీకరిస్తూ కేసీఆర్ సంతకం పెట్టిన విషయం కేటీఆర్ కు తెలియకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తండ్రికొడుకులకు ప్రజల సమస్యల గురించి మాట్లాడుకునే తీరిక లేకుండా పోయిందని సంచలన వ్యాఖ్యలు చేశారు రఘు నందన్ రావు.
వాస్తవాలు బయటకు రాకూడదన్న ఉద్దేశంతోనే రిటైరైన అధికారుల్ని ఇంకా పదవుల్లో కొనసాగిస్తున్నారని విమర్శించారు. 24 గంటలు ఉచిత కరెంటు ఇస్తామన్న హామీ ఏమైందని ప్రశ్నించారు. గజ్వేల్, సిద్ధిపేట, సిరిసిల్ల నియోజకవర్గాల్లో మినహా రాష్ట్రంలో మరెక్కడా 24 గంటల కరెంట్ ఇవ్వడం లేదని ఆరోపించారు.
రైతుల డిమాండ్ మేరకు రాత్రి పూట కూడా కరెంటు ఇవ్వాల్సి ఉన్నప్పటికీ.. ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. ఉచిక కరెంట్ పై క్షేత్రస్థాయి వాస్తవాలు భిన్నంగా ఉన్నాయని మండిపడ్డారు. దీనిపై టీఆర్ఎస్ పెద్దలు చర్చకు రావాలని రఘునందన్ డిమాండ్ చేశారు.