ప్రధాని నరేంద్ర మోడీ హ్యాట్రిక్ కొట్టారు. వరుసగా మూడో ఏడాదీ ప్రపంచ నంబర్ వన్ నేతగా నిలిచారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ ను వెనక్కి నెట్టి.. మోడీ ప్రథమ స్థానం సాధించారు. మార్నింగ్ కన్సల్ట్ అనే అమెరికా సంస్థ నిర్వహించిన సర్వేలో ప్రపంచ దేశాధినేతల్లో మోడీ ముందున్నారు. సంస్థ నిర్వహించిన సర్వేలో 72 శాతం మంది ప్రజలు భారత ప్రధాని మోడీకి ఆమోదం తెలిపారు.
ఆ తర్వాతి స్థానంలో మెక్సికో అధ్యక్షుడు లోపెజ్ ఓబ్రడార్ ఉన్నారు. ఆయనకు 64 శాతం మంది మద్దతు ప్రకటించారు. 57 శాతం మంది ఆమోదంతో ఇటలీ ప్రధాని మారియో ద్రాగ్చి మూడో ర్యాంకు సాధించారు. జపాన్ ప్రధాని ఫ్యూమియో కిషిదాకు 47 శాతం మంది మద్దతు ప్రకటించారు. ఐదో స్థానంలో జర్మనీ చాన్స్ లర్ ఒలాఫ్ షూల్జ్.. 42% మద్దతుతో నిలిచారు. బైడెన్ ఆరో స్థానంలో నిలవడం గమనార్హం. ఆయనకు కేవలం 41 శాతం మందే ఓటేశారు.
దక్షిణ కొరియా అధ్యక్షుడు మూన్ జే ఇన్, ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్, కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడూలకూ 41 శాతం మందే మద్దతు తెలపారు. దీంతో వారు కూడా బైడెన్ తో పాటే సంయుక్తంగా ఆరో స్థానాన్ని పంచుకున్నారు. 37 శాతం ఓట్లతో స్పెయిన్ ప్రధాని పెడ్రో శాంచెజ్ ఏడో స్థానంలో ఉన్నారు.
36 శాతం ఓట్లతో బ్రెజిల్ అధ్యక్షుడు జయర్ బోల్సోనారో ఎనిమిదో ర్యాంకులోనూ.. 35 శాతం ఓట్లతో ఫ్రాన్స్ ప్రధాని ఇమ్మాన్యుయేల్ మెక్రాన్ 9వ ర్యాంకుతో నిలువగా.. 30 శాతం మంది ఆమోదంతో బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ పదో స్థానంలో నిలిచారు. కాగా.. 21 శాతం మంది ప్రధాని నరేంద్ర మోడీని వ్యతిరేకించారు. మరో 7 శాతం మంది తమకేం తెలియదంటూ పేర్కొన్నారు.