స్వచ్ఛత అభియాన్ పట్ల నిర్లక్ష్యం వహించిన నగరాల జాబితా తయారు చేసి చర్యలు చేపట్టాలని మేయర్లను ఆదేశించారు ప్రధాని నరేంద్ర మోడీ. న్యూ అర్బన్ ఇండియా నేపథ్యంలో నిర్వహిస్తున్న అఖిల భారత మేయర్ల సదస్సును ప్రారంభించారు. ఉత్తర్ ప్రదేశ్ లోని వారణాసి వేదికగా శుక్రవారం జరిగిన ఈ సమావేశంలో వివిధ రాష్ట్రాలకు చెందిన 120 మంది మేయర్లు పాల్గొన్నారు.
ప్రస్తుతం భారత్ కు కావాల్సింది వికాసమే కానీ.. విప్లవం కాదని ప్రధాని వ్యాఖ్యానించారు. స్వచ్ఛతలో అగ్రస్థానంలో నిలిచిన నగరాలతో పాటు అందుకు కృషి చేసిన ఇతర ప్రాంతాలనూ గుర్తించాలని పట్టణాభివృద్ధి శాఖ మంత్రి హర్దీప్ సింగ్ పురికి ఆదేశించారు. మేయర్లు తమ నగరాలను అత్యంత స్వచ్ఛత కలిగినవిగా తీర్చిదిద్దేలా చర్యలు చేపట్టాలని పిలుపునిచ్చారు.