అభిమానం బంగారమైంది. ఆ బంగారానికి ఓ రూపాన్ని ఇచ్చారు. ఆ రూపమే దేశ ప్రధాని నరేంద్ర మోడీ అయ్యారు. మోడీ పై ఉన్న అభిమానంతో ఓ స్వర్ణకారుడు ఏకంగా 18 క్యారెట్ల బంగారంతో ఆయన బంగారు విగ్రహాన్నే తయారు చేసి ఆశ్చర్య పరిచాడు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో మోడీ సాధించిన విజయాన్ని పురష్కరించుకొని ఈ గోల్డెన్ స్టాచ్యు ని తయారు చేసినట్టు ఆ వీరాభిమాని వెల్లడించారు.
సూరత్ కు చెందిన సందీప్ జైన్ 156 గ్రాముల బరువున్న బంగారు విగ్రహాన్ని తయారు చేశారు. దీన్ని రూపొందించడానికి 11 లక్షలు ఖర్చు అయ్యాయని ఆయన తెలిపారు. దీనిని తయారు చేసేందుకు దాదాపు 20 మంది కళాకారులు 3 నెలల పాటు శ్రమించారని ఆయన పేర్కొన్నారు. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల్లో భాజపా గెలవగానే విగ్రహం పని మొదలు పెట్టామని చెప్పారు సందీప్ జైన్.
మన దేశ ప్రజలు బంగారాన్ని చాలా ఎక్కువగా ఇష్టపడతారు. ఇక దేశ ప్రధాని నరేంద్ర మోడీని పొగిడేందుకు మాటలు కూడా సరిపోవు. ఆయనకు ప్రజల మనోభావాలు బంగారం కంటే తక్కువ కాదు. ప్రజలు ఆయనను ఎంతగా ఆరాధిస్తారో తెలియజేయడానికే మేము ఆయన విగ్రహాన్ని బంగారంతో తయారు చేశాము. గుజరాత్ ఎన్నికల్లో భాజపా 156 సీట్లు గెలుచుకున్నప్పుడు ప్రధాని మోడీ విగ్రహాన్ని తయారు చేయాలని మా స్వర్ణకారుల బృందం నిర్ణయించుకున్నాం. ఈ విగ్రహం బరువు 156 గ్రాములు. దీని బరువు భాజపా సాధించిన సీట్ల సంఖ్యకు సమానం. విగ్రహం పూర్తి చేయడానికి 20 నుంచి 25 మంది బృందం మూడు నెలలు శ్రమించిందని స్వర్ణకారుడు సందీప్ జైన్ తన మనోగతాన్ని వ్యక్త పరిచారు.
ఇక ప్రధాని స్ఫూర్తికి,కృషికి గుర్తుగా ఈ విగ్రహాన్ని రూపొందించినట్లు మరో స్వర్ణకారుడు వసంత్ బోహ్రా తెలిపారు. ఈ విగ్రహం ప్రధాని మోదీని తలపించే విధంగా ఉందని,గుజరాత్ ఫలితాలతో తాను సంతృప్తి చెందానని బోహ్రా అన్నారు. ఆయన కళ్లద్దాలు, ముఖం కళ్లు వంటివి అచ్చుగుద్దినట్లుగా తయారు చేశామని స్వర్ణకారులు పేర్కొన్నారు.