అంబానీ, అదానీలకు దోచిపెట్టేందుకే మోడీ గ్యాస్ ధరలు పెంచారని మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ మండి పడ్డారు. కేంద్ర బీజేపీ ప్రభుత్వం పేద, మధ్య తరగతి ప్రజల ఉసురు పోసుకుంటోందని ఆయన ఆరోపించారు.
వంట గ్యాస్ పెంపును నిరసిస్తూ సికింద్రాబాద్ లోని జూబ్లీ బస్ స్టేషన్ వద్ద నిర్వహించిన ధర్నా, ఆందోళనలో ఆయన పాల్గొన్నారు. ధరలను అదుపు చేయడంలో విఫలమైన మోడీ వెంటనే గద్దె దిగాలని డిమాండ్ చేశారు. బడా వ్యాపారవేత్తలకు దోచిపెట్టడానికే గ్యాస్ ధరలు పెంచారని మండిపడ్డారు.
తెలంగాణలో అధికారంలోకి వస్తామని బీజేపీ నేతలు కలలు కంటున్నారని ఎద్దేవా చేశారు.2024 ఎన్నికల్లో కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పతనం ఖాయమని మంత్రి తలసాని వ్యాఖ్యానించారు. కంటోన్మెంట్ లోని ప్రజలకు వైద్య సేవలు అందించేందుకు ఆర్మీ హాస్పిటల్ లో అనుమతించలేదు.. అందుకే సీఎం కేసీఆర్ చొరవ తీసుకొని ఆ ప్రాంతంలో మల్టీస్పెషాలిటీ హాస్పిటల్ ను మంజూరు చేశారని గుర్తు చేశారు.
కంటోన్మెంట్ లో గతంలో 15 రోజులకు ఒక సారి త్రాగునీటి సరఫరా జరిగేది.. కానీ నేడు ప్రతినిత్యం సరఫరా జరుగుతుందన్నారు. తెలంగాణలో అమలవుతున్న సంక్షేమ పథకాలను దేశ వ్యాప్తంగా చేసేందుకే టీఆర్ఎస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీగా మారిందన్నారు.