బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పై ఆ పార్టీ జాతీయ కార్యవర్గంతో పాటు మోడీ ప్రశంసల వర్షం కురిపించారు. ప్రజా సంగ్రామ యాత్ర నుంచి ఇతర నేతలు నేర్చుకోవాలంటూ ప్రధాని పొగడ్తలతో ముంచెత్తారు. అంతే కాదు బండి సంజయ్ ను చూస్తుంటే వెంకయ్యనాయుడు గుర్తొస్తారని మోడీ కితాబు కూడా ఇచ్చారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సైతం ప్రజా సంగ్రామ యాత్రను ప్రస్తావించడంతో పాటు బండిని ప్రత్యేకంగా అభినందించారు.
ఇదంతా కూడా ఢిల్లీలో ప్రారంభమైన బీజేపీ కార్యవర్గ సమావేశాల్లో మొదటి రోజే జరగడం విశేషం. రాష్ట్రంలో పార్టీ పనితీరు, ప్రజాసంగ్రామ యాత్రపై సంజయ్ నివేదిక సమర్పించారు. ఈ సందర్భంగా.. బండి సంజయ్ ను చూస్తే వెంకయ్యనాయుడు గుర్తొస్తారని..అద్బుతంగా మాట్లాడుతారని.. పార్టీ అభివృద్ధికి ఎంతగానో కృషి చేస్తున్నారంటూ ప్రధాని నరేంద్రమోడీ ప్రశంసల జల్లు కురిపించినట్టు సమాచారం. ఇక ప్రజాసంగ్రామ యాత్ర ఏవిధంగా కొనసాగిందో చెప్పాలని మోడీ సంజయ్ కు సూచించారు. అప్పుడు సంజయ్ కొద్దిసేపు హిందీలో మాట్లాడిన తర్వాత తాను పూర్తిస్థాయిలో చెప్పలేకపోతున్నానని తెలిపారు. దీనికి స్పందించిన ప్రధాని భావోద్వేగాలతో కూడిన అంశాన్ని మాతృభాషలోనే చెప్పగలమంటూ.. తెలుగులో మాట్లాడాలని సూచించారు.
ఈ సందర్భంగా ప్రజా సమస్యలపై పోరు, పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడమే లక్ష్యంగా ప్రజా సంగ్రామ యాత్ర చేపట్టామని సంజయ్ చెప్పారు. చార్మినార్ భాగ్యలక్ష్మీ ఆలయంతో పాటు వివిధ ప్రాంతాల్లో చేపట్టిన కార్యక్రమాలు,యాత్ర సాగిన తీరును వివరించడంతో కార్యవర్గ సభ్యులంతా కరతాళధ్వనులు చేశారు. అనంతరం మరోసారి ప్రధాని మాట్లాడుతూ రాష్ట్రంలో పార్టీ అభివృద్దికి సంజయ్ ఎంతగానో పాటుపడుతున్నారని కితాబిచ్చారు. ఎంతో గొప్పగా యాత్ర చేసిన సంజయ్ తన గురించి తాను గొప్పగా చెప్పుకోలేరని, యాత్రలో పాల్గొన్న తెలంగాణ బీజేపీ ఇన్ ఛార్జి హిందీలో వివరించాలని కోరు.
దీంతో సంజయ్ తెలుగులో మాట్లాడిన అంశాన్ని తరుణ్ ఛుగ్ హిందీలో అనువదించడంతో పాటు యాత్రలో చోటుచేసుకున్న వివిధ ఘట్టాలను వివరించారు. అనంతరం మరోసారి ప్రధాని మాట్లాడుతూ బండి సంజయ్ యాత్ర చేపట్టిన మార్గాల్లోకి ఇతర రాష్ట్రాల నేతలు వెళ్లి యాత్ర సాగిన తీరుపై అధ్యయనం చేయాలని సూచించారు. భవిష్యత్ లో సంజయ్ చేపట్టే యాత్రకు ఇతర రాష్ట్రాల నుంచి యువ మోర్చా నేతలను పంపిస్తే మార్గదర్శకంగా ఉంటుందంటూ మోడీ సంజయ్ భుజం తట్టి అభినందించారు.