రోజ్ గార్ మేళాలో భాగంగా కేంద్ర ప్రభుత్వ శాఖల్లో 71,000 మంది అభ్యర్థులకు అప్పాయింట్ మెంట్ లెటర్లను ప్రధాని నరేంద్రమోడీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పంపిణీ చేశారు. కేంద్రప్రభుత్వ శాఖల్లో జూనియర్ ఇంజనీర్లు, లోకో పైలట్లు,టెక్నీషియన్లు, ఇన్ స్పెక్టర్లు, సబ్ ఇన్ స్పెక్టర్లు, కాని స్టేబుళ్లుగా చేరే అభ్యర్థుల రిక్రూట్ మెంట్లకు నియామక పత్రాలను పంపిణీ చేయడం ద్వారా మోడీ రోజ్ గార్ మేళాను ప్రారంభించారు.
రోజ్ గార్ మేళాతో ఉపాధి కల్పన, యువతకు సాధికారత లభిస్తుందని ప్రధాని కార్యాలయం విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. ఉపాధి మేళా ద్వారా యువత సాధికారత సాధిస్తూనే, దేశాభివృద్ధిలో వారి భాగస్వామ్యానికి భరోసా కల్పిస్తోంది. స్టెనో గ్రాఫర్, జూనియర్ అకౌంటెంట్, ఇన్ కమ్ ట్యాక్స్ ఇన్ స్పెక్టర్, టీచర్, నర్సు, డాక్టర్, సోషల్ సెక్యూరిటీ ఆఫీసర్, పర్సనల్ అసిస్టెంట్, మల్టీ టాస్క్ స్టాఫ్ లకు నియామక పత్రాలను ప్రధాని అందజేశారు.
ప్రధాని మోడీ గత ఏడాది నవంబర్ 22 వ తేదీన 71,000 మందికి అపాయింట్ మెంట్ లెటర్ లను పంపిణీ చేశారు. గత ఏడాది అక్టోబర్ లో 75,000 మందికి పైగా ఉద్యోగులను నియమించారు.