దారి తప్పి వెళ్లిందో.. దారి తెలియక వెళ్లిందో.. తెలియదు కానీ ఓ వానరం నడి సముద్రంలో వెళ్లింది. ఎటు చూసినా నీళ్లే ఉండే సరికి తిరిగి రావడానికి దానికి మార్గం కనబడలేదు. దీంతో చేసేదేం లేక సముద్రంలోనే కాంక్రీట్ వేవ్ బ్రేకర్ల మీద రోజులు గడిపింది. చేపల వేటకు వెళ్లిన మత్స్యకారులు పెట్టిన ఆహారం తింటూ ప్రాణాలు నిలబెట్టుకుంది. ఇలా నడి సముద్రంలోనే బిక్కుబిక్కుమంటూ మూడు నెలల కాలం వెళ్లదీసిన ఆ వానరం చివరికి ఒడ్డుకు ఎలా చేరిందంటే..?
ఏపీలోని తూర్పుగోదావరి జిల్లాలో ఉన్న బంగాళఖాతంలో ఓ కోతి చిక్కుకుంది. కాకినాడ హార్బర్కు దాదాపు మూడు నాటికల్ మైళ్ల దూరానికి అది ఎలా వెళ్లిందో తెలియదు కానీ.. అక్కడి నుంచి బయటికి రాలేక నానా అవస్థలు పడింది. ఎవరైనా వచ్చి సాయం చేస్తారని ఎదురుచూస్తూ.. సముద్రంలో కెరటాలను అదుపులో ఉంచేందుకు ఏర్పాటు చేసిన కాంక్రీట్ వేవ్ బ్రేకర్ల పై కాలం గడిపింది. అటుగా చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు తాము తిన్న ఆహారంలో కొంత ఆ వానరానికి అందివ్వటంతో కడుపు నింపుకుంది.
అయితే, ఆ కాంక్రీట్ వేవ్ బ్రేకర్ల మీద వేడి వాతావరణంలో కోతి దుస్థితిని చూసి మత్స్యకారుల మనస్సు చలించింది. ఆ వానరాన్ని ఎలాగైనా సముద్రంలో నుంచి బయటకి తీసుకురావాలనుకున్నారు. వెంటనే ప్రకాశం జిల్లా కొత్తపట్టణంలో పనిచేస్తున్న స్వచ్ఛంద సంస్థ యానిమల్ వారియర్స్ కన్జర్వేషన్ సొసైటీ హెల్ప్ లైన్కు మత్స్యకారులు సమాచారం ఇచ్చారు. ఇక్కడ పనిచేస్తున్న సంజీవ్ వర్మ, అమర్నాథ్, మనీశ్, రామకృష్ణలతోపాటు హైదరాబాద్లో వానరాలపై ప్రత్యేకంగా పనిచేసే సంతోషి, అనిరుథ్, కాకినాడ యానిమల్ రెస్క్యూ బృందం పడవల్లో వానరం వద్దకు చేరుకొని దాన్ని కాపాడేందుకు ప్రయత్నించారు.
కానీ తొలి రెండు రోజులు వానరం వారికి చిక్కలేదు. ఫైనల్గా మూడో రోజైన శనివారం అతికష్టం మీద వానరాన్ని బోనులో బంధించి ఒడ్డుకు చేర్చారు. అనంతరం అక్కడి నుంచి కాకినాడ జిల్లా అటవీశాఖాధికారి కార్యాలయానికి తరలించి దట్టమైన చెట్ల పొదల్లో కోతిని విడిచిపెట్టడంతో.. సంతోషంగా గెత్తులేస్తుంటూ వెళ్లిపోయింది.