నిన్నటి వరకు విదేశాల నుంచి వచ్చే వారికి కరోనా టెస్టులు చేసి కానీ తమ సొంత ఇళ్లకు పంపడం లేదు. దాంతో విదేశాల నుంచి వచ్చే వారితో కరోనా భయం ప్రజల్లో ఉండేది. ఇప్పటికీ ఆ భయం పోలేదు. మళ్లీ విదేశాల నుంచి వచ్చే వారితో మరో కొత్త భయం పట్టుకుంది. అదే మంకీ పాక్స్…ఎప్పుడు ఏ విధమైన వైరస్ లను విదేశీయులు తీసుకుని వస్తున్నారో అనే టెన్షన్ మళ్లీ అందరిలో మొదలైంది.
తాజాగా దుబాయ్ నుంచి విజయవాడ వచ్చిన ఓ చిన్నారి లో మంకీ పాక్స్ లక్షణాలు కనిపించడం కలకలం రేపింది.అయితే ఆ చిన్నారి ఇటీవలే తన కుటుంబంతో కలిసి దుబాయ్ నుంచి విజయవాడకు వచ్చింది. ఆమె ఒంటి పై ఓ రకమైన దద్దుర్లు, జ్వరం రావడంతో తల్లిదండ్రులు ఆస్పత్రికి తీసుకెళ్లారు.
అక్కడ చిన్నారి చర్మంపై దద్దుర్లను, ఇతర లక్షణాలను పరిశీలించిన వైద్యులు.. అవి మంకీ పాక్స్ లక్షణాల తరహాలో కనిపించడంతో అప్రమత్తమయ్యారు. వెంటనే కుటుంబం మొత్తాన్ని ఐసోలేషన్ కు తరలించారు.విజయవాడ పాత ప్రభుత్వ ఆస్పత్రిలో చిన్నారిని ఉంచి చికిత్స అందజేస్తున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.
చిన్నారి నుంచి నమూనాలు సేకరించి పుణెలోని వైరాలజీ ల్యాబ్ కు పంపించినట్టు వెల్లడించాయి. చిన్నారికి సోకినది మంకీ పాక్స్ వైరసా, మరేదైనా అయి ఉంటుందా అన్నది ల్యాబ్ నివేదిక వచ్చిన తర్వాతే నిర్ధారణ అవుతుందని తెలిపాయి. అయితే ఈ అంశంపై అధికారికంగా స్పందించేందుకు నిరాకరించాయి.
ఆఫ్రికాలో మొదట బయటపడిన మంకీ పాక్స్ వైరస్ ఇప్పటివరకు సుమారు 60 దేశాలకు విస్తరించింది. ఆఫ్రికాతోపాటు యూరప్ లో ఎక్కువగా కేసులు నమోదవుతున్నాయి. ఇటీవల మన దేశంలోని కేరళలో తొలి మంకీ పాక్స్ కేసు నమోదైంది.
మంకీ పాక్స్ వైరస్ సోకినవారికి ముఖం, చేతులు, కాళ్లపై దద్దుర్లు ఏర్పడుతాయి. జ్వరం, తలనొప్పి, నడుమునొప్పి, తీవ్రమైన నీరసం వంటి లక్షణాలు కూడా ఉంటాయి. ఈ వ్యాధి సోకినవారిలో చాలా మంది సులువుగానే కోలుకుంటారు. కొందరిలో మాత్రం ప్రాణాపాయం తలెత్తే ప్రమాదం ఉంటుందని వైద్యులు చెప్తున్నారు