దేశంలో మంకీపాక్స్ కేసుల పెరుగుతోంది. తాజాగా దేశంలో కేసుల సంఖ్య 7కు చేరింది. ఈ క్రమంలో ప్రజలకు కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ కీలక సూచనలు చేశారు.
రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి ప్రజలకు వైరస్ పై అవగాహన కల్పిస్తున్నామని, ఇన్ఫెక్షన్లు వ్యాపించకుండా చర్యలను తీసుకుంటున్నట్టు రాజ్యసభలో ఆయన వెల్లడించారు.
దేశ ప్రజలకు మంకీపాక్స్ వంటి వ్యాధుల విషయంలో అవగాహన కల్పించడం చాలా ముఖ్యమని పేర్కొన్నారు. ఇప్పటికే నీతి ఆయోగ్ సభ్యుడి నేతృత్వంలో టాస్క్ఫోర్స్ ను ఏర్పాటు చేసినట్టు తెలిపారు.
పరిస్థితులపై టాస్క్ఫోర్స్ అధ్యయనం చేసిన తర్వాత వారి సలహాలను స్వీకరిస్తామని చెప్పారు. ఆ తర్వాత ఆ మేరకు చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. కేరళ రాష్ట్రానికి ఎలాంటి సహాయం కావాల్సి వచ్చినా కేంద్రం అందిస్తుందని అన్నారు.
ప్రపంచ వ్యాప్తంగా మంకీ పాక్స్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో ముందస్తు జాగ్రత్తలు మొదలు పెట్టామన్నారు. ప్రయాణికుల స్క్రీనింగ్ నివేదికలను, సంబంధిత అధికారులను దేశానికి పంపించాలంటూ విదేశీ ప్రభుత్వాలను కోరామన్నారు.
మంకీపాక్స్ వ్యాధి కొత్తదేం కాదన్నారు. 1970ల నుంచి ఆఫ్రికాలో కేసులు నమోదవుతున్నాయని వివరించారు. దీనిపై ప్రపంచం ఆరోగ్య సంస్థ ప్రత్యేక శ్రద్ధ వహించిందన్నారు. దేశంలోనూ పర్యవేక్షణ మొదలైందన్నారు. నిరంతర నిఘాతో వ్యాధిని అదుపులో ఉంచవచ్చన్నారు.
‘ ఈ వ్యాధికి వ్యతిరేకంగా వ్యాక్సిన్ అందుబాటులోకి తెచ్చేందుకు ఐసీఎంఆర్ సిద్ధంగా ఉంది. మంకీపాక్స్ నుంచి వైరస్ స్ట్రెయిన్ను ఐసీఎంఆర్ వేరు చేసింది. దీన్ని వ్యాక్సిన్ తయారీ కంపెనీలకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నాము. ఇందుకోసం ప్రతిపాదనలు సైతం పంపాము’ అని తెలిపారు.