కరోనా వైరస్ వివిధ రకాల వేరియంట్ల రూపంలో ప్రపంచ దేశాలను వణికిస్తోంది. దేశంలో కేసులు అధికంగా పెరగడానికి కారణం అయిన కరోనా థర్డ్ వేరియంట్ ఒమిక్రాన్ యొక్క సబ్ వేరియంట్ ఇప్పుడు అలజడి సృష్టిస్తోంది. దీనిని అరికట్టేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తలను కనిపెట్టేందుకు ఒహాయో స్టేట్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పరిశోధనలు చేపట్టారు. దాని నుండి విస్తృత, సమర్థ రక్షణ కల్పించడానికి బూస్టర్ డోసులు దోహదపడతాయని తమ పరిశోధనలో తేలినట్టు వెల్లడించారు.
వైరస్ తో ఆసుపత్రుల్లో చేరిన పలువురు కొవిడ్ బాధితుల నుంచి వారు రక్త నమూనాలు సేకరించి, యాంటీబాడీల స్థాయిలను విశ్లేషించినట్టు తెలిపారు. ఎంఆర్ఎన్ఏ వ్యాక్సిన్ రెండు డోసులతో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీలు.. ఒమిక్రాన్ సబ్-వేరియంట్ అయిన ‘బీఏ.3’ను మాత్రమే సమర్థంగా నియంత్రిస్తోందని తెలిపారు.
ఇతర సబ్ వేరియంట్లు.. బీఏ.1, బీఏ.1.1, బీఏ.2లతో పాటు.. డెల్టా ఒమిక్రాన్ వైరస్ల జన్యు సమ్మేళనాలతో ఉద్భవించిన డెల్టాక్రాన్కు వ్యతిరేకంగా.. బూస్టర్ డోసు మాత్రమే రక్షణ కల్పించగలదన్న అభిప్రాయానికి వచ్చారు. బూస్టర్ డోసుతో ఏ వేరియంట్ నుంచైనా రక్షణ లభిస్తుందని ప్రధాన పరిశోధనకర్త, వైరాలజీ నిపుణుడు షాన్-లు లియూ పేర్కొన్నారు.
ఒమిక్రాన్ సోకినవారిలో ఉత్పత్తి అయ్యే యాంటీబాడీల కన్నా.. బూస్టర్ డోసు ద్వారా ఉద్భవించే ప్రతి నిరోధకాలే వివిధ వేరియంట్ల నుంచి అధిక రక్షణ కల్పిస్తున్నట్టు మరో పరిశోధనకర్త జాన్ ఇవాన్స్ తెలిపారు.