అది ములుగు జిల్లా బుస్సాపూర్ . జిల్లా కేంద్రానికి 25 కిలో మీటర్ల దూరంలో ఉన్న ఈ చిన్న అటవీ గ్రామం. ఆ గ్రామంలో ఉన్నవి 220 కుటుంబాలు అంటే మహా అయితే ఆ గ్రామంలో ఉండే జనాభా వెయ్యిలోపే. అయితేనేం?! 50కు పైగా కుటుంబాలు చేసుకున్నవి ప్రేమపెళ్ళిళ్ళే.! కులం లేదు, మతం లేదు.ధనిక పేద తారతమ్యం లేదు. ఆ ఊరు ప్రేమ పెళ్ళిళ్ళకు పెట్టింది పేరు బుస్సాపూర్.
ఇక్కడి వాళ్లలో ఎక్కువ మంది నిరుపేదలే.కానీ ప్రేమకు మాత్రం పేదవాళ్ళుకాదు. ప్రేమ పెళ్లి విషయంలో ఎంతో మందికి ఆదర్శంగా నిలిచారు. పచ్చని అడవిలో స్వచ్ఛమైన ప్రేమతో జీవిస్తున్నారు.గ్రామంలో 50కి పైగా ప్రేమ పెళ్లిళ్లు జరిగాయి. ఈ జంటల్లో చదువుకున్న వారితో పాటు..చదువుకోని వారున్నారు.ప్రేమ జంటల్లో ఎక్కువ మంది కులాంతర వివాహం చేసుకున్నవారే..
అంతా కూలి పనులు చేసుకుంటూ ఎలాంటి గొడవలు, విద్వేషాలు లేకుండా వచ్చిన డబ్బులతో సంతోషంగా జీవిస్తున్నారు. ప్రేమించి పెళ్ళి చేసుకున్న వారిలో ఎవరు గొడవలు పెట్టుకోని విడిపోయిన వారు కూడా లేరని గ్రామస్తులు అంటున్నారు.
గ్రామానికి చెందిన యువతీ యువకులు ప్రాథమిక విద్య పూర్తయిన తర్వాత పై చదువుల కోసం గోవిందరావు పేట, ములుగుకు వెళ్లేవారు. కలిసి వెళ్ళి తిరిగి వస్తూ ఉన్న క్రమంలో కొందరు యువతీ యువకుల మధ్య స్నేహం పెరిగింది. అది ప్రేమగా మారి పెళ్లికి దారి తీసింది.ఇలా గ్రామంలో ఎన్నో ప్రేమ పెళ్ళిళ్ళు జరిగాయి.
కొందరు ప్రేమికుల పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో గుడికి వెళ్లి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత ఊర్లోకి వచ్చి జీవిస్తున్నారు. పెళ్లయిన తర్వాత పెద్దలు చేరదీశారు. బతుకుదెరువుకు ఏదో ఒకపని చేసుకుంటూ ఇప్పుడు సంతోషంగా ఉన్నామని పెళ్లయిన ప్రేమ జంటలు చెబుతున్నారు.
ప్రేమపెళ్లి చేసుకుని విడిపోతే ఆ ప్రేమకు అర్థం లేదని కొందరు ప్రేమికులు అంటున్నారు. కష్టమైనా సుఖమైనా కలిసి బతకడంలోనే ఆనందం ఉందని చెబుతున్నారు.
ప్రేమలు, కులాంతర వివాహం చేసుకున్న వారంతా ఎలాంటి గొడవలు లేకుండా ప్రశాంతంగా జీవిస్తున్నారు. అందుకే ఇది ప్రేమలు పండిన ఊరు. ప్రేమ జంటలకు పెట్టింది పేరు, మన బుస్సాపూర్.