అమ్మ ప్రేమకు సాటిలేనిదని మరోసారి రుజువైంది. తన ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి తన బిడ్డను కాపాడుకునే ప్రయత్నిం చేసింది ఓ తల్లి. ఛత్తీస్గఢ్లోని కోర్బా జిల్లాలో కన్నకూతురిని కాపాడడం కోసం అడవి పందితో భీకర పోరాటం చేసి..చివరికి ప్రాణాలు కోల్పోయింది ఓ తల్లి.
దువాషియా బాయి (45) అనే మహిళ తన కూతురు రింకి (11)తో తెలియామర్ గ్రామంలో అడవికి సమీపంలో పనులు చేసుకుంటోంది. దువాషియా బాయి మట్టిని తవ్వుతున్న సమయంలో ఆ ప్రాంతానికి ఓ అడవి పంది దూసుకొచ్చింది.
దువాషియా కూతురు రింకీపై దాడి చేయబోయింది. దీంతో గడ్డపారతో అడవి పందిని అడ్డుకుంది దువాషియా.అయినా అడవి పంది వదలకుండా దాడి చేయడంతో దువాషియాకి తీవ్ర గాయాలయ్యాయి. తనకు ఎన్ని గాయాలైనా తన కూతురి వద్దకు అడవి పందిని వెళ్లనివ్వకుండా కట్టడి చేసింది.
తన కూతురికి చిన్న గాయం కూడా కానివ్వలేదు. ఎట్టకేలకు దువాషియా అడవి పందిని చంపేసింది. అయితే, తీవ్రగాయాలతో కాసేపటికే ఆ తల్లి కూడా మృతి చెందింది. ఆమె కుటుంబానికి అటవీ శాఖ అధికారులు తక్షణ సాయంగా రూ.25 వేలు ఇచ్చారు. మరో రూ.5.75 లక్షల పరిహారాన్ని త్వరలోనే అందించనున్నారు.