పుట్టిన బిడ్డను వదిలేసిన కన్నతల్లి
చెత్తకుప్పలో పడేసిన డాక్టర్, నర్స్
మచిలీపట్నంలో దారుణం
మచిలీపట్నం : పుట్టిన బిడ్డ భారం అవుతుందని భావించిన ఓ తల్లి ఇంకా కళ్లు తెరవని పసిగుడ్డును వదిలేసి వెళ్లిపోయింది. ఆమె ప్రసవించిన ప్రైవేటు ఆసుపత్రి డాక్టర్, నర్సు కలిసి ఆ చిన్నారిని చెత్తకుప్పలో పడేశారు. ఇంత ఘోరానికి పాల్పడిన ఇద్దరినీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ దారుణం కృష్ణా జిల్లా మచిలీపట్నంలో జరిగింది.
బందరులో వున్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో గుర్తు తెలియని మహిళ ప్రసవించింది. పుట్టిన బిడ్డను మరుసటి రోజు అక్కడే వదిలేసి వెళ్లిపోయింది. నర్సింగ్ హోమ్ డాక్టర్ ధన్వంతరి శ్రీనివాసాచార్య, ఏఎన్ఎం బేబీరాణి కలిసి, ఆ బిడ్డను దగ్గర్లోనే ఉన్న శ్రీ వెంకటేశ్వరాలయం దగ్గర చెత్తకుప్పలో పడేశారు. బిడ్డను గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వాళ్లు వచ్చేసరికే బిడ్డలో చలనం లేదు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి శిశువును తరలించినా అప్పటికే ప్రాణాలు విడిచిందని చెప్పారు. ఈ దారుణం చూసి అక్కడున్న వారి కళ్లు చెమర్చాయి. కేసు నమోదు చేసిన పోలీసులు డాక్టర్, నర్సులను అదుపులోకి తీసుకున్నారు.