ఒకప్పుడు తరగతి గదిలో అందరికంటే బాగారాణించే అమ్మాయి ఆమె. దిగువ మధ్యతరగతి కుటుంబ పరిస్థితులు ఆమె చదువుని మధ్యలోనే ఆపేసాయి. పెళ్ళి,భర్త, పిల్లలు, సంసారం ఇలా ఒక దాని తర్వాత వస్తున్న బాధ్యతలతోనే కాలం గడిచిపోయింది. కానీ ఎప్పటికైనా చదువు కొనసాగించాలనే ఆమె సంకల్పాన్ని మాత్రం విడిచి పెట్టలేదు.
కుమార్తె ఇచ్చిన ప్రోత్సాహంతో తన కుమారుడితో కలిసి పదో తరగతి పరీక్షలకు హాజరవుతోంది.కచ్చితంగా ఈ పరీక్షల్లో ఉత్తీర్ణురాలని అవుతానని ధీమా వ్యక్తం చేస్తోంది. ఇంతకీ ఆమె ఎవరు..ఈ వయసులో ఎందుకు చదవాలనుకుంటుందో తెలుసుకుందాం.
బంగాల్కు చెందిన ఆయేషా బేగం..తూర్పు బుర్ద్వాన్ జిల్లా శక్తిగఢ్ పోలీస్స్టేషన్ పరిధిలోని ఘట్శిలా అనే గ్రామంలో నివసిస్తోంది. ఆమె భర్త వ్యవసాయం చేస్తుండగా.. ఆయేషా ఐసీడీఎస్ (ఇంటిగ్రేటెడ్ చైల్డ్ డెవలప్మెంట్ స్కీమ్)లో పనిచేస్తోంది. వీరికి ఫిర్దౌసి, పర్వేజ్ ఆలం అనే కుమార్తె, కుమారుడు ఉన్నారు.
కాగా, ఆయేషాకు చిన్నప్పటి నుంచి చదువు మీద ఆసక్తి ఉండేది. కానీ, కుటుంబ పరిస్థితులు, వివాహం, పిల్లలు తదితర కారణాల వల్ల చదువుకోలేకపోయింది. పిల్లలు పెద్దవారయ్యాక కూడా చదువుకునేందుకు వీలు పడలేదు.
అయితే, తాను చదువుకోలేక పోయినా..తన పిల్లలు ఉన్నతవిద్య అభ్యసించాలని ఆశించింది. అనుకున్నట్టే ఇద్దరిని చదివించింది. అమ్మ ఆశయం వైపు ఆడుగులేసిన ఆయేషా కుమార్తె ఫిర్దౌసి ఎంఏ పూర్తి చేసింది.
కానీ ఆయేషా బేగం కుమారుడు పర్వేజ్కు చదువు అబ్బలేదు. దీంతో ఆరేళ్ల క్రితమే పదో తరగతి పూర్తి కాకుండానే చదువు మానేశాడు.అమ్మకు చదువుపై ఉన్న మక్కువను గ్రహించిన కుమార్తె ఫిర్దౌసి.. ఆయేషాను చదువుకోమని ప్రోత్సహించేంది. అమ్మతో పాటు తమ్ముడిని కూడా మళ్లీ చదువువైపు మళ్లించింది.
అందులో భాగంగానే తల్లీకుమారుడికి మేమారి హై మదర్సాలో సీటు లభించింది. ప్రస్తుతం వీరిద్దరు పదో తరగతి బోర్డు పరీక్షలకు హాజరవుతున్నారు. కాగా, ఈ వయసులో ఆయేషా బేగం పరీక్షలకు హాజరు కావడం.. చదువు మానేసిన పర్వేజ్ మళ్లీ పరీక్షలు రాస్తుండడం వల్ల టీచర్లు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.