వైఎస్ వివేకానంద హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి సీబీఐ విచారణ ముగిసింది. హైదరాబాద్ లోని కోఠి సీబీఐ కార్యాలయంలో శుక్రవారం అవినాష్ రెడ్డి విచారణకు హాజరయ్యారు. సుమారు నాలుగున్నర గంటల పాటు అవినాష్ రెడ్డిని సీబీఐ అధికారులు విచారించారు. ఇదే కేసులో అరెస్టైన దస్తగిరి ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా సీబీఐ విచారణ చేసినట్లు తెలుస్తోంది. అవినాష్ కాల్ డేటా, బ్యాంకు ట్రాన్స్ జాక్షన్స్ పై అధికారులు ఆరా తీసినట్లు సమాచారం.
సీబీఐ విచారణ ముగిసిన అనంతరం అవినాష్ రెడ్డి మీడియాతో మాట్లాడారు. సీబీఐ అధికారులు ఇచ్చిన 160 సీఆర్పీసీ నోటీసుల ప్రకారం విచారణకు హాజరయ్యానని తెలిపారు. సీబీఐ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు వివరణ ఇచ్చానని అవినాష్ రెడ్డి చెప్పారు.
మళ్లీ విచారణకు ఎప్పుడు పిలిచినా హాజరవుతానని ఆయన స్పష్టం చేశారు. విచారణ పారదర్శకంగా జరగాలని సీబీఐ అధికారులను కోరానన్నారు. ఇన్వెస్టిగేషన్ కు సంబంధించిన విషయాలు బహిర్గతం చేయలేనని చెప్పారు.
సీబీఐ అధికారులకు ఉన్న అనుమానాలపై నా సమాధానాలతో నివృత్తి చేశానన్నారు. నాలుగున్నర గంటల పాటు అధికారులు నన్ను విచారించారన్నారు. అయితే కొన్ని మీడియా సంస్థలు తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నాయని ఆయన మండిపడ్డారు.