కర్నూలులో హైటెన్షన్ కొనసాగుతోంది. కడప ఎంపీ అవినాష్ రెడ్డి ఇప్పటికీ కర్నూలులోని విశ్వభారతి ఆసుపత్రిలోనే ఉన్నారు. తల్లి లక్ష్యమ్మ అనారోగ్యం కారణంగా ఈ నెల 19వ తేదీ నుంచి అవినాష్ రెడ్డి ఆసుపత్రిలో ఉంటున్నారు. లక్ష్మమ్మ ఆరోగ్యం ఆందోళనకరంగా ఉండటంతో వైద్యసేవలను దగ్గరుండి పరిశీలిస్తున్నారు. దీంతో మే 19వ తేదీ నుంచి 22వ తేదీ వరకు అవినాష్ రెడ్డి సీబీఐ విచారణకు హాజరుకాలేదు. అవినాష్ కు సంఘీభావంగా వైఎస్సార్సీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు, కార్యకర్తలు భారీ సంఖ్యలో ఆసుపత్రికి చేరుకున్నారు. ఆసుపత్రి ముందే బైఠాయించి నిరసనలు తెలుపుతున్నారు.
అవినాష్ రెడ్డి పరిస్థితిని మానవీయ కోణంలో చూడాలని సీబీఐకి పలువురు నేతలు విజ్ఞప్తి చేస్తున్నారు. దీంతో మంగళవారం కూడా ఆసుపత్రి వద్ద హైటెన్షన్ కొనసాగింది. మరోవైపు అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పై తెలంగాణ హైకోర్టులో మే 25న విచారణ జరగనుంది. అక్కడ తేలేవరకు అరెస్టు చేయకుండా ఉత్తర్వులు ఇవ్వలేమని సర్వోన్నత న్యాయస్థానం తేల్చి చెప్పింది.
అయితే వివేకానందరెడ్డి హత్యకేసులో నిందితుడైన ఎంపీ అవినాష్ రెడ్డి అరెస్ట్ వ్యవహారంలో సీబీఐ తీరును పలువురు తప్పుబడుతున్నారు. అవినాష్ ను అరెస్టు చేయాలని ఫిబ్రవరిలోనే ఆదేశాలు జారీ చేసిన సీబీఐ, న్యాయస్థానానికి నివేదించి నెలలు గడుస్తున్నా ఇప్పటివరకూ అదుపులోకి తీసుకోలేకపోయిందని దుయ్యబడుతున్నారు.
మరోవైపు.. ముందస్తు బెయిల్ కోసం పలు దఫాలుగా చేసుకున్న అవినాష్ ప్రయత్నాలన్నీ విఫలమవుతున్నాయి. ఆయన్ని అరెస్టు చేయొద్దంటూ సీబీఐని ఆదేశించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. న్యాయపరమైన చిక్కులన్నీ తొలగిపోయినప్పటికీ సీబీఐ ఎందుకో మీనమేషాలు లెక్కిస్తూనే ఉంది. మరి చివరికి ఏం జరుగుతుందో చూడాలి.