– నీ తాటాకు చప్పుళ్లకు భయపడం..
– దమ్ముంటే.. సీబీఐ విచారణకు సిద్ధమా?
– ఇంటర్ విద్యార్థుల ఆత్మహత్యలకు కారకులెవరో తేలుద్దాం
– హామీలిచ్చి మోసం చేస్తున్న మీపై 420 కేసులు పెట్టాలి
– కేటీఆర్ నోటీస్ పై బండి ఫైర్
మంత్రి కేటీఆర్ పరువు నష్టం దావా నోటీసులపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. తాను ప్రజల తరఫున పోరాడుతున్నానని, వాస్తవాలే మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు. లీగల్ నోటీసుల పేరుతో కేసీఆర్, కేటీఆర్ చేసే తాటాకు చప్పళ్లకు భయపడే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ‘‘నీకు నిజంగా ఇంటర్ విద్యార్థుల చావుకు కారణమైన గ్లోబరీనా సంస్థతో సంబంధం లేకుంటే.. ఈ వ్యవహారంలో ఐటీ శాఖ తప్పు లేదని భావిస్తే.. సీబీఐ విచారణ జరపాలని కేంద్రానికి లేఖ రాయి’’అని సవాల్ విసిరారు. ప్రజా సంగ్రామ యాత్రలో భాగంగా 30వరోజు మహేశ్వరం నియోజకవర్గంలోని సిరిగిరిపురం సమీపంలోని హెచ్ఎండీ పార్క్ వద్ద మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఈ వ్యాఖ్యలు చేశారు.
‘‘మీ నిర్వాకం వల్ల 27 మంది విద్యార్థులు చనిపోయారు. ఆ పాపం ఊరికే పోతదా? పేద విద్యార్థులు చనిపోతే మీ అయ్య కనీసం స్పందించలేదు. విద్యార్థులకు అన్యాయం జరిగిందని తల్లిదండ్రులు బాధ చెప్పుకోవడానికి పోతే లాఠీఛార్జ్ చేయించిన దుర్మార్గపు కుటుంబం మీది. నేను వాస్తవాలే మాట్లాడుతున్నా.. నువ్వు ఐక్య రాజ్యసమితి పోయి నోటీస్ ఇచ్చుకో.. నామీద దావా వేసే ముందు గ్లోబరీనా సంస్థకి నీకు ఉన్న సంబంధమేంటో చెప్పాలి. మీరు ఉద్యోగాలివ్వకపోవడం వల్ల వందల సంఖ్యలో యువకులు ఆత్మహత్యలు చేసుకున్నరు. వాళ్ల చావులకు నువ్వు, నీ అయ్యనే కారణం’’ అని కేటీఆర్ పై మండిపడ్డారు బండి.
ఆర్టీసీ కార్మికుల ఆత్మహత్యలకు, గుండె ఆగిన చావులకు కారణం ఎవరని ప్రశ్నించారు. 317 జీవోతో ఇంటికొకరు పుట్టకొకరు అయి చాలామంది ఉద్యోగులు ఆత్మహత్య చేసుకున్నారని.. వరి వేస్తే ఉరే అన్న ప్రకటనతో కల్లాల మీద తనువు చాలించిన రైతుల చావులకు కారణం ఎవరని నిలదీశారు. ‘‘అసలు మీ మీద 420 కేసు పెట్టాలి. దళితుడిని సీఎం చేస్తానన్నవ్. దళితులకు మూడెకరాలు ఇస్తానన్నవ్. అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేస్తానన్నవ్. నిరుద్యోగ భృతి ఇస్తానన్నవ్. రైతులకు రుణమాఫీ అన్నవ్. ఇంటికో ఉద్యోగమిస్తానన్నవ్. ప్రాజెక్టులన్నీ పూర్తి చేస్తానని హామీలిచ్చి మోసం చేశావ్. నీకు గ్లోబరీనా సంస్థతో సంబంధం లేకుంటే సీబీఐ విచారణ జరపాలని లేఖ రాయ్.. నీ సంగతి అంతా తెలుసు. మీకు, యూఏఈలో ఉన్న బీఆర్ శెట్టితో ఉన్న సంబంధమేంటో అన్నీ తెలుసు. ఆ లింకులన్నీ బయటకు తీస్తున్నం. మీ సంగతి తేలుస్తాం’’ అంటూ వార్నింగ్ ఇచ్చారు.
Advertisements
శనివారం మీటింగ్ కు లక్షలాది మంది వస్తుండటంతో కేసీఆర్, కేటీఆర్ గజగజా వణికిపోతున్నారని అన్నారు సంజయ్. ఇంటెలిజెన్స్ రిపోర్ట్ రావడంతో ఏం చేయాలో తెల్వక లీగల్ నోటీసులతో డ్రామాలాడుతున్నారని విమర్శించారు. తాను ఇప్పటికే చాలాసార్లు ప్రజా సమస్యలపై కొట్లాడి జైలుకు పోయానని గుర్తు చేశారు. ఎన్ని లీగల్ నోటీసులిచ్చినా భయపడే ప్రసక్తే లేదన్నారు. నిజంగా ఇంటర్ విద్యార్థుల చావుకు కారణమైన గ్లోబరీనా సంస్థతో కేటీఆర్ కు సంబంధం లేకుంటే.. ఈ వ్యవహారంలో ఐటీ శాఖ తప్పు లేదని భావిస్తే.. సీబీఐ విచారణ జరపాలని కేంద్రానికి లేఖ రాయాలని సవాల్ చేశారు బండి సంజయ్.