ఆహారం, ఆరోగ్యం, ఆవాసం.. తెలంగాణలో అటకెక్కాయని మండిపడ్డారు బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్. తెలంగాణలోని రైస్ మిల్లుల్లో అక్రమాలు, మిల్లర్లపై రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడంతో కేంద్ర కోటా కింద వరి కొనుగోలును నిలిపివేస్తున్నట్లు ఎఫ్సీఐ తెలంగాణ పౌరసరఫరాల శాఖకు లేఖ రాసింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో మీడియాతో మాట్లాడిన అరవింద్.. కేసీఆర్ సర్కార్ పై విరుచుకుపడ్డారు.
రానున్న కాలంలో తెలంగాణ నుంచి వడ్ల కొనుగోలు అపుతామని ఎఫ్సీఐ తెలిపిందని, 593 మిల్లుల్లో అధికారులు లెక్కపెట్టే వీలు లేకుండా ధాన్యాన్ని పేర్చారని విమర్శించారు. 4 లక్షల 83వేల 600 బ్యాగులు తక్కువగా ఉన్నాయని.. రెండు సంవత్సరాల నుంచి లెక్కపెట్టకుండా అదే పరిస్థితి కల్పించారని ఆరోపించారు. కేంద్రం ఇస్తోన్న ఉచిత రేషన్ బియ్యాన్ని కేటీఆర్ బ్లాక్ మార్కెట్ చేసుకుంటున్నారని విమర్శించారు.
గరీబ్ కళ్యాణ్ యోజన పథకం కింద 2లక్షల మెట్రిక్ టన్నుల బియ్యాన్ని ఏంచేశారో కేసీఆర్, కేటీఆర్ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. బియ్యం బొక్కేస్తున్న కేటీఆర్ తో చెప్పించుకునే స్థితిలో బీజేపీ లేదని విరుచుకుపడ్డారు అరవింద్. తమకు అవసరమైనప్పుడు సలహాలు తీసుకుంటామని సెటైర్లు వేశారు. ఎవరినీ సస్పెండ్ చేయాలో… ఎవరికి బాధ్యతలు ఇవ్వాలో బీజేపీ నాయకత్వానికి తెలుసన్న ఆయన.. తెలంగాణలో అత్యాచారాలపై ప్రభుత్వ పెద్దలు ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.
గ్రూప్ వన్ పరీక్షలో ఉర్థూ భాషను ఎత్తివేయాలన్న అరవింద్.. ప్రభుత్వ ఆస్తులు అమ్మి జీతాలు, పెన్షన్లు ఇవ్వటం సిగ్గుచేటన్నారు. నాలుగైదు రోజుల్లో పాఠశాలలు ప్రారంభం అవుతున్నప్పటకీ.. టెక్ట్స్ బుక్స్ కోసం టెండర్లకు పిలవకపోవటం దారుణమని.. కవితకు ఇప్పటికైనా హిందుత్వం గుర్తొచ్చినందుకు సంతోషమని అన్నారు.