కాంగ్రెస్ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి మరోసారి హాట్ కామెంట్స్ చేశారు. శనివారం ప్లీనరీ కోసం రాయ్ పూర్ వెళ్లిన ఆయన మీడియాతో మాట్లాడుతూ.. పార్టీలో తన ప్రాధాన్యతపై కీలక వ్యాఖ్యలు చేశారు. గతంలో పీసీసీ పదవి ఇవ్వలేకపోయిన సందర్భంగా తనకు న్యాయం చేయలేకపోయామని, భవిష్యత్తులో సముచిత స్థానం కల్పిస్తామని పార్టీ పెద్దలు హామీ ఇచ్చారని అన్నారు.
ఈ నేపథ్యంలో సీడబ్ల్యూసీ చోటు విషయంలో తనకు న్యాయం జరుగుతుందని ఆశాభావంతో ఉన్నట్లు చెప్పారు. సీడబ్ల్యూసీలో చోటు కల్పిస్తే మరింత ఉత్సాహంగా పని చేస్తానని లేకుంటే తన పరిధిలోని 20 అసెంబ్లీ నియోజకవర్గాలకే పరిమితం అవుతానని వ్యాఖ్యానించారు.
తెలంగాణలో కాంగ్రెస్ కి ఎలాంటి పొత్తులు అవసరం లేదన్నారు. జాతీయ స్థాయిలో సంకీర్ణ ప్రభుత్వమే వస్తుందని ఏఐసీసీ చీఫ్ ఖర్గేనే చెప్పారని గుర్తు చేశారు. రాష్ట్రంలో పార్టీ పరిస్థితులపై చర్చించేందుకు ప్రియాంక గాంధీ అపాయింట్మెంట్ కోరానని త్వరలో ఢిల్లీలో భేటీ అవుతానని చెప్పారన్నారు.
అసెంబ్లీ ఎన్నికల విషయంలో ముఖ్యమంత్రి కేసీఆర్ ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియదు. అందుకే 50 శాతం సీట్లను వెంటనే ప్రకటించాలని కోరుతానన్నారు. గత ఎన్నికల్లో టికెట్లు, పొత్తులపైనే మూడు నెలలు కాలయాపన జరిగిందన్నారు. అందువల్ల ఆశావాహులు ఎక్కువగా ఉన్న చోట కొంత ఆలస్యం జరిగినా.. పట్టు ఉన్న చోట్ల మాత్రం అభ్యర్థులను ప్రకటించాలని ప్రియాంకా గాంధీకి చెప్పబోతున్నట్లు తెలిపారు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి