ఉద్యోగులతో పీఆర్సీపై చర్చించి సీఎం కేసీఆర్ ఎన్నికల కోడ్ను ఉల్లంఘించారని ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. తెలంగాణకు కేంద్రం అన్యాయం చేస్తే… పార్లమెంట్లో టీఆర్ఎస్ ఎంపీలు ఎందుకు మాట్లాడరు అని ఆయన ప్రశ్నించారు. దుబ్బాక, జీహెచ్ఎంసీలో వచ్చిన ఫలితాలే ఎమ్మెల్సీ ఎన్నికల్లో సైతం పునరావృతమవుతాయన్నారు.
కేంద్రం చేసిన సాయంపై అసెంబ్లీలో చర్చకు సిద్ధమని టీఆర్ఎస్ నేతలకు రఘునందనరావు సవాల్ విసిరారు. మందబలంతో సభను నడిపితే కుదరదన్నారు. నిరుద్యోగభృతిపై సభలో ప్రభుత్వ వైఖరీని ప్రశ్నిస్తామన్నారు. బైంసాలో గత ఘటనలకు కారణమైన వారిని కఠినంగా శిక్షించి ఉంటే శాంతి భద్రతలు బాగుండేవన్నారు.
జర్నలిస్టులపై ప్రేమ వలకబోసిన ట్విట్టర్ పిట్ట కేటీఆర్.. వారిని కత్తితో పొడిస్తే ఎందుకు స్పందించలేదని రఘునందన్ ప్రశ్నించారు. ఆంధ్రా ప్రాంత కార్పొరేట్ కంపెనీలు, పట్టభద్రుల ఓట్ల కోసమే వైజాగ్ స్టీల్ ఫ్లాంట్పై మంత్రి కేటీఆర్ ప్రేమ చూపిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.