ఓ క్రీడాభిమాని తన ఫేవరెట్ క్రికెటర్ ధోనీపై గౌరవాభిమానాల్ని చాటుకున్నాడు. పెండ్లి పత్రికపై వినూత్నంగా కెప్టెన్ కూల్ ఫొటోను ముద్రించాడు. వివాహ వేదిక వివరాలతో పాటు ధోని ఫొటో ముద్రించిన ఈ ఆహ్వాన పత్రిక ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఈ నెల 12న కర్ణాటకలో వివాహం జరుగుతున్నట్లు ఫోటోలోని వివరాల ఆధారంగా తెలుస్తోంది. కర్ణాటకకు చెందిన శమంత్ కుమార్ పిజి (సిద్ధార్థ్) వరుడు కాగా, వధువు పేరు భవ్యశ్రీ (రమ్య). వెడ్డింగ్ కార్డ్లో ఒకవైపు గణేశుడి ఫోటో ముద్రించగా, మరోవైపు ధోనీ ఫోటో ముద్రించారు.
కార్డుపై మహేంద్ర సింగ్ ధోనీ ఫోటో ఛాంపియన్స్ ట్రోఫీ 2013 నాటిదిగా తెలుస్తోంది. వైరల్ గా మారిన ఈ ఆహ్వాన పత్రికకు సంబంధించిన మిగతా వివరాలు తెలియరాలేదు. కర్ణాటక ధోని ఫ్యాన్స్ అసోసియేషన్ ఈ ఫొటోను ట్వీట్ చేసింది. కాగా, తమిళనాడుకు చెందిన మరో అభిమాని తన ఇంటికి పసుపు రంగు వేయించాడు.
ధోనిపై, చెన్నై సూపర్ కింగ్స్ జట్టుపై తన అభిమానాన్ని చాటుకునేలా ఇల్లు మొత్తాన్ని పసుపు రంగుతో ముంచేశాడు. హోమ్ ఆఫ్ ధోనీ ఫ్యాన్ అని తన ఇంటికి పేరుపెట్టుకున్నాడు. తమిళనాడులోని అరంగుర్లో గోపీ కృష్ణన్, అతని కుటుంబం ఈ రకమైన ప్రేమను చూపించి వార్తల్లో నిలిచారు.