ముంబైలో మీజిల్స్ వైరస్ విజృంభిస్తోంది. తాజాగా నగరంలో మరో 32 మందికి మీజిల్స్ సోకినట్టు బ్రిహిన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) వెల్లడించింది. దీంతో నగరంలో మొత్తం కేసుల సంఖ్య 300కి చేరుకుంది. వీటిలో గత రెండు నెలల్లో 2 వందల కేసులు నమోదయ్యాయి.
గడిచిన కొన్నేండ్లలో ఈ స్థాయిలో భారీగా మీజిల్స్ కేసులు నమోదవడం ఇదే తొలిసారి అని అధికారులు చెబుతున్నారు. గోవండీలోని మురికివాడలో నివాసిస్తున్న 8 నెలల బాలుడు గురువారం మధ్యాహ్నం మృతి చెందాడు. దీంతో మీజిల్స్తో నగరంలో మొత్తం 13 మంది చిన్నారులు మరణించారు.
బీఎంసీ పరిధిలోని ముంబై, మాలేగావ్, భీవాండీ, థానే, నాసిక్, అకోలా, కళ్యాణ్ తదితర ప్రాంతాల్లో ఈ తరహా కేసులు నమోదవుతున్నాయి. దీంతో ఆరోగ్య సిబ్బంది అప్రమత్తమయ్యారు. బైకళా, వర్లీ, వడాల, ధారావి, బాంద్రా, అంధేరీ, మలాడ్, గోవండీ, చెంబూర్, కుర్లా, భాండూప్ తదితర ప్రాంతాల్లో వ్యాక్సినేషన్ చేపట్టారు.
9 నెలల నుంచి 5 ఏండ్ల మధ్య వయస్సున్న మొత్తం 1,34,833 మంది చిన్నారులకు మీజిల్స్-రుబెల్లా స్పెషల్ డోసులను అధికారులు పంపిణీ చేస్తున్నారు. దేశంలో మహారాష్ట్రతోపాటు బిహార్, గుజరాత్, హర్యానా, జార్ఖండ్, కేరళలోనూ మీజిల్స్ కేసులు నమోదవుతున్నాయి.