అంర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురష్కరించుకొని రాష్ట్రంలోని పట్టణాల్లో మహిళా వారోత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు పురపాలక శాఖ మంత్రి కేటీఆర్ తెలిపారు. మహిళా దినోత్సవం సందర్భంగా సమాజంలో మహిళల శక్తిని, పాత్రను సెలబ్రేట్ చేసేలా ఈ ఉత్సవాలు నిర్వహించాలని, ఇందుకు సంబంధించి అవసరమైన కార్యాచరణను రూపొందించాలని పురపాలక శాఖ అధికారులను ఆదేశించారు.
ఈ నేపథ్యంలో మహిళా వారోత్సవాలను నిర్వహించేందుకు పురపాలక శాఖ కార్యాచరణను ప్రకటించింది. మార్చి 8న మహిళా దినోత్సవం రోజున ప్రారంభమయ్యే ఈ వారోత్సవాల్లో వివిధ కార్యక్రమాలను నిర్వహించనున్నది. పురపాలికల్లో వివిధ హోదాలలో ప్రాతినిథ్యం వహిస్తున్న మహిళా ప్రజాప్రతినిధులు, పురపాలక శాఖ సిబ్బంది, స్వయం సహాయక సంఘాల సభ్యులు, పారిశుద్ధ్య కార్మికులు, వివిధ ఎన్జీవోల సిబ్బందితో ఈ మహిళా దినోత్సవ వారోత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపింది.
వారం పాటు నిర్వహించే ఈ మహిళా వారోత్సవాల్లో క్రీడా, సాంస్కృతిక కార్యక్రమాలు, మహిళలకు హెల్త్ క్యాంపు నిర్వహణ, వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన మహిళలు, ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు సన్మానం వంటి కార్యక్రమాలను చేపట్టనున్నట్లు మంత్రి కేటీఆర్ తెలిపారు.
దీంతో పాటు పురపాలికల్లో ఏదైనా ఒక రంగంలో ముఖ్యంగా డ్రై కంపోస్ట్, కిచెన్ కాంపోస్టింగ్, నీటి సంరక్షణ లాంటి మొదలైన రంగాల్లో ఆదర్శవంతమైన పద్ధతుల్లో ముందుకెళ్తున్న పురపాలిక సిబ్బంది లేదా పట్టణంలోని మహిళలను ప్రత్యేకంగా గుర్తించి వారిని సన్మానించాలని సూచించారు.