కర్నాటకలో హిజాబ్ వివాదం ఎంతటి దుమారం రేపిందో చూశాం. విద్యార్థులు రెండు వర్గాలుగా ధర్నాలు, నిరసన కార్యక్రమాలు కొనసాగించారు. పలుచోట్ల ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అయితే.. ప్రభుత్వం విధించిన నిషేధాన్ని సమర్థించిన హైకోర్టు తీర్పుపై ముస్లిం అనుబంధ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ క్రమంలో ఏకంగా జడ్జీలకు బెదిరింపు కాల్స్ వెళ్తుండడం చర్చనీయాంశంగా మారింది.
హిజాబ్ వివాదంపై తీర్పు చెప్పిన బెంచ్ కు నేతృత్వం వహించిన హైకోర్టు చీఫ్ జస్టిస్ రితురాజ్ అవస్థీని తమిళనాడుకు చెందిన తౌహీద్ జమాత్ అనే సంస్థ బెదిరించింది. ఆయనతో పాటు తీర్పులో భాగమైన న్యాయమూర్తులనూ చంపేస్తామంటూ ఓ వీడియోలో వార్నింగ్ ఇచ్చాడు వ్యక్తి. దీనిపై హైకోర్టు రిజిస్ట్రార్ జనరల్ కు న్యాయవాది ఉమాపతి ఫిర్యాదు చేశారు.
వాట్సాప్ లో తనకు ఓ వీడియో వచ్చిందని.. అందులో జార్ఖండ్ న్యాయమూర్తి మార్నింగ్ వాక్ చేస్తుండగా హత్యకు గురైన విషయాన్ని ప్రస్తావిస్తూ అవస్థీని బహిరంగంగా బెదిరించడం కనిపించిందని వివరించారు. ఈ క్రమంలోనే రంగంలోకి దిగిన పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. తౌహీద్ జమాత్ సంస్థకు చెందిన ముగ్గురు సభ్యులను గుర్తించారు. తమిళనాడుకు చెందిన ఇద్దరిని అరెస్ట్ చేశారు.
తిరునల్వేలికి చెందిన తమిళనాడు తాహీద్ జమాత్ ఆడిటింగ్ కమిటీ మెంబర్ రహ్మతుల్లా, తంజావూరులోని మత బోధకుడు ఎస్.జమాల్ మహ్మద్ ఉస్మానీని అదుపులోకి తీసుకున్నారు పోలీసులు. వీరే కాదు.. తౌహీద్ జమాత్ కు చెందిన పలువురిపై బెదిరింపు కేసులు నమోదయ్యాయి.