రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని కాంగ్రెస్ నేత బక్క జడ్సన్ రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఫిర్యాదు చేశారు. రాష్ట్రపతి కార్యాలయంలో వినతి పత్రం సమర్పించారు ఆయన. రాష్ట్రం 4 లక్షల కోట్లకు పైగా అప్పుల్లో ఉందని ఆయన రాష్ట్రపతికి ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు.
4 లక్షల కోట్లకు ఇన్ స్టాల్ మెంట్లు కట్టడానికి 13 వేల కోట్లు అవుతాయన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు సీఎం కేసీఆర్ కుటుంబ ఆస్తులు ఏవిధంగా పెరిగాయో వివరాలను కూడా బక్క జడ్సస్ రాష్ట్రపతికి ఇచ్చిన ఫిర్యాదులో తెలిపినట్లు సమాచారం. దేశంలో ఏ రాజకీయ నాయకుడు కూడా ఇంత సంపాదించలేదని ఆయన ఆరోపించారు.
రాష్ట్రం కోసం విద్యార్థులు చేసిన ప్రాణత్యాగాలకు అర్థం లేకుండా పోయిందని జడ్సన్ తన ఫిర్యాదులో వా పోయారు. రాష్ట్రం మొత్తం పెత్తందారి వ్యవస్థగా మారిపోయిందని ఆయన ఆరోపించారు. రాష్ట్రంలో శాంతి, భద్రతలు లోపించాయని ఆరోపించిన ఆయన ఆర్టికల్ 356 ప్రకారం రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన పెట్టాలని రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు ఇచ్చిన ఫిర్యాదులో ఆయన కోరారు.
ధరణి పోర్టల్ కు కారకుడైన మాజీ సీఎస్ సోమేశ్ కుమార్ పై సీబీఐ విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. సోమేశ్ కుమార్ అక్రమంగా ఆస్తులు కూడబెట్టారని జడ్సన్ ఆరోపణలు చేశారు.