వనపర్తి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. తిరుపతికి భక్తులతో వెళ్తున్న బస్సు కొత్త కోట సమీపంలో బోల్తా పడింది. ఈ ఘటనలో 15 మందికి గాయాలయ్యాయి. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసుల కథనం ప్రకారం..
యాదగిరిగుట్ట డిపో బస్సు 37 మంది ప్రయాణికులతో తిరుపతి బయలుదేరింది. వనపర్తి జిల్లా కొత్తకోట సమీపంలోకి చేరుకోగానే బస్సు అదుపు తప్పి జాతీయ రహదారి 44 నుంచి పక్కకు దూసుకు వెళ్లింది. దీంతో బస్సు బోల్తా పడింది.
ప్రమాదంలో పలువురికి గాయాలయ్యాయి.
గాయపడిన వారిలో జయన్న (బద్వేల్), నర్సింహ (కేశంపేట), కృపానంద (హైదరాబాద్), ఉపేందర్ (జనగామ), షబ్బీర్ అహ్మద్ (కర్నూల్), షకీల (రాయచోటి), అర్జున్ (కర్నూల్), శ్రీరామ్ (రాయచోటి), రఫీక్ (షాద్నగర్), శ్రీకాంత్చారి (హన్మకొండ), సుమలత (ఆళ్లగడ్డ)లతో పాటు మరో నలుగురు ఉన్నారు.
మొత్తం 15 మంది ప్రయాణికులకు గాయాలయ్యాయి. వీరిలో నర్సింహ, షకీల, షబ్బీర్ అహ్మద్ పరిస్థితి విషమంగా ఉంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.