శ్రీశైలం ప్రాజెక్టు అందాలు ప్రజలను కట్టిపడేస్తున్నాయి. ఎగువ నుంచి భారీగా నీరు వస్తుండడంతో అధికారులు 5 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఎగువ నుంచి వస్తున్న వరద ఉద్ధృతితో కృష్ణమ్మ ఉప్పొంగి ప్రవహిస్తోంది.
ప్రాజెక్టు 5 గేట్లు ఎత్తడంతో కృష్ణమ్మ బిరబిరా పరుగులు పెడుతోంది. పైన ఉన్న జూరాల, సుంకేశుల ప్రాజెక్టుల నుంచి లక్షా 47వేల 405 క్యూసెక్కుల నీరు ప్రాజెక్టులో కలిసి వస్తుండగా..2 లక్షల 5వేల 432 క్యూసెక్కుల నీటిని సాగర్కు విడుదల చేస్తున్నారు.
ఇక శ్రీశైలం డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 885.80 అడుగులు కాగా.. ప్రస్తుతం 884.5 అడుగు ల వరకు నీరుంది. శ్రీశైలం జలాశయం పూర్తి నీటి నిల్వ సామర్థ్యం 215.8 టీఎంసీలు. ప్రస్తుతం 212 టీఎంసీల నీరు నిల్వ ఉంది. శ్రీశైలం గేట్లు ఎత్తారన్న సమాచారంతో హైదరాబాద్ సహా తెలంగాణలోని పలు ప్రాంతాలతో పాటు ఏపీ నుంచి పర్యాటకులు శ్రీశైలం ప్రాజెక్టు సందర్శనకు వెళ్తున్నారు.
దీనికి తోడు శనివారం, ఆదివారం వరుస సెలవులు కావడంతో పర్యాటకుల తాకిడి భారీగా పెరిగింది. శ్రీశైలం డ్యాం నుంచి విడుదలవుతున్న నీటి పరవళ్లను తిలకించేందుకు పర్యాటకులు భారీగా తరలి వస్తున్నారు.
ఎగువన కురుస్తున్న భారీ వర్షాలకు నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతుంది. అధికారులు ఇప్పటికే 20 క్రస్ట్ గేట్లు 10 అడుగుల మేర ఎత్తి దిగువకు నీటిని విడుదల చేశారు. సాగర్ ఇన్ఫ్లో 3 లక్షల, 14వేల, 293 క్యూసెక్కులు కాగా, ఔట్ఫ్లో 3 లక్షల, 37వేల, 961 క్యూసెక్కులుగా కొనసాగుతుంది. ప్రాజెక్ట్ పూర్తిస్థాయి నీటిమట్టం 590 అడుగులుగా ఉండగా, ప్రస్తుత నీటిమట్టం 589.30 అడుగులుగా ఉంది.