హైదరాబాద్ శివారు చెంగిచర్ల అటవీ బ్లాక్ పరిధిలోని అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటుకు అక్కినేని నాగార్జున ముందుకు వచ్చారు. ఎంపీ జోగినపల్లి సంతోష్ కుమార్ తో కలిసి చెంగిచర్లలో శంకుస్థాపన కార్యక్రమంలో నాగార్జున కుటుంబ సమేతంగా పాల్గొన్నారు. అక్కినేని నాగార్జున, అమల, కుమారులు నాగ చైతన్య, నిఖిల్ తో పాటు ఇతర కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ సంధర్భంగా హరిత నిధి ద్వారా రెండు కోట్ల రూపాయల చెక్ ను తన తండ్రి, దివంగత ప్రఖ్యాత నటుడు అక్కినేని నాగేశ్వర రావు పేరు మీద అటవీ శాఖ ఉన్నతాధికారులకు అందించారు.
రాష్ట్రం, దేశం కూడా ఆకుపచ్చగా, పర్యావరణ హితంగా మారాలన్న సంకల్పంతో, తెలంగాణకు హరితహారం స్ఫూర్తితో గ్రీన్ ఇండియా ఛాలెంజ్ ప్రారంభించారని అన్నారు నాగార్జున. తాను స్వయంగా పాల్గొని పలు మార్లు మొక్కలు నాటానాని తెలిపారు. గత బిగ్ బాస్ సీజన్ ఫైనల్ కార్యక్రమం సందర్భంగా అడవి దత్తతపై ప్రకటించినట్లుగానే.. అటవీ పునరుద్దరణ, అర్బన్ ఫారెస్ట్ పార్కు ఏర్పాటుకు శంకుస్థాపన చేయటం ఆనందంగా ఉందని నాగార్జున అన్నారు.
ఈ అటవీ ప్రాంతం చుట్టూ ఉన్న పట్టణ ప్రాంత కాలనీ వాసులకు పార్కు ఎంతగానో ఉపయోగపడుతుందని అన్నారు. గ్రీన్ ఇండియా ఛాలెంజ్ కార్యక్రమం ద్వారా అడవి దత్తతకు నాగార్జున ముందకు రావటాన్ని ఎంపీ సంతోష్ కుమార్ ప్రశంసించారు. అక్కినేని నాగేశ్వర రావు పేరుపై అర్బన్ పార్కు అభివృద్దితో పాటు.. ఖాళీ ప్రదేశాల్లో దశల వారీగా లక్ష మొక్కలను నాటే కార్యక్రమాన్ని నేటి నుంచే ప్రారంభించినట్టు ఎంపీ వెల్లడించారు.
దేశంలో ఏ పెద్ద నగరానికి లేని ప్రకృతి సౌలభ్యత ఒక్క హైదరాబాద్ కే ఉందన్నారు. రాజధాని చుట్టూ ఉన్న లక్షా యాభై వేల ఎకరాలకు పైగా అటవీ భూమిని పరిరక్షించటం, పునరుద్దరణ చేయటం, అర్బన్ పార్కుల ఏర్పాటుకు గ్రీన్ ఇండియా ఛాలెంజ్ తమ వంతు ప్రయత్నం చేస్తుందని సంతోష్ అన్నారు.