ఇంద్రవెల్లి మండలం కేస్లాపూర్ లోని నాగోబా జాతరకు అంతా సిద్ధమయ్యింది. శనివారం అర్థరాత్రి మహాపూజతో ఈ జాతర ప్రారంభమవుతుంది. ఈ వేడుక కోసం మెస్రం వంశీయులు, అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ జాతరను ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోంది. ఏటా పుష్య అమావాస్య రోజున నాగోబా జాతర ప్రారంభమవుతుంది. ఒకే చోటుకు.. మూడు రాష్ట్రాల ఆదివాసీలను చేర్చే జాతర నాగోబా. ఈ జాతరకు తెలంగాణ నుంచే కాకుండా మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్గఢ్ నుంచి ఆదివాసీలు, సామాన్య భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తారు.
కాలినడకన 80 కిలో మీటర్ల దూరంలోని జన్నారం మండలంలోని కలమడుగు హస్తినమడుగు నుంచి తీసుకొచ్చిన గోదావరి జలాన్ని పుష్య అమావాస్యకు ఒకరోజు ముందు కేస్లాపూర్ లోని మర్రిచెట్టు వద్ద ఉంచుతారు. అనంతరం నాగ దేవునికి గంగా జలంతో అభిషేకం చేస్తారు. పుష్యమాసపు అమావాస్య అర్ధరాత్రి లోకమంతా నలుపు రంగు పులుముకుంటే.. ఆదిలాబాద్ లోని కేస్లాపూర్ లో మాత్రం దేదీప్యమానమైన వెలుగుల మధ్య ఈ జాతర మొదలవుతుంది.
చిమ్మ చీకట్లలో చల్లటి గాలుల మధ్య దట్టమైన అడవి పండగ వాతావరణంతో కళకళలాడుతుంది. తర తరాల సంప్రదాయంగా.. అడవిబిడ్డలు ఎంతో నిష్టగా నాగదేవునికి ప్రత్యేక పూజలు జరుపుతారు. నాగోబా జాతర చివరి రోజు జరిగే దర్బార్ తో జాతర ముగుస్తుంది. జాతరకు నలుమూల నుంచి వేల సంఖ్యలో వస్తున్న గిరిజనుల సమస్యలు తెలుసుకోవచ్చనే ఉద్దేశంతో దర్బార్ ఏర్పాటు చేస్తారు.
ఈనెల 24న కలెక్టర్ సిక్తా పట్నాయక్ అధ్యక్షతన దర్బార్ ని నిర్వహించనున్నారు. ఈ దర్బార్ కి మంత్రులు, ఎమ్మెల్యేలతో పాటు పలువురు అధికారులు హాజరవుతారు. దీని కోసం పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. కాగా ఏటా దర్బార్ లో విన్నవించుకున్న సమస్యలు పరిష్కారానికి నోచుకోవడంలేదని ఆదివాసీలు ఆరోపిస్తున్నారు.