కాంగ్రెస్ సీనియర్ లీడర్ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై కేసు నమోదు అయ్యింది. ఐపీసీ 506 సెక్షన్ కింద నల్గొండ వన్ టౌన్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. టీపీసీసీ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్, ఆయన కొడుకు డాక్టర్ చెరకు సుహాస్ చేసిన ఫిర్యాదు మేరకు.. వెంకట్ రెడ్డిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
తనను చంపుతానంటూ కోమటిరెడ్డి ఫోన్ లో బెదిరించారని చెరుకు సుహాస్ తన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఎంపీ వెంకట్ రెడ్డితో తనకు ప్రాణహానీ ఉందని సుహాస్ తెలిపారు. వెంకట్ రెడ్డిపై నల్లగొండ జిల్లా ఎస్పీకి కూడా చెరుకు సుహాస్ మంగళవారం ఫిర్యాదు చేశారు.
కాగా కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు చెరుకు సుధాకర్ ను తన అనుచరులు చంపేస్తారంటూ ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు సంచలనం రేపాయి. చెరుకు సుధాకర్ కొడుకు సుహాన్ కు కోమటిరెడ్డి కాల్ చేసిన ఆడియో వైరల్ అయింది.
ఈ క్రమంలో కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై చర్యలు తీసుకోవాలని చెరుకు సుధాకర్, కొడుకు సుహాస్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వీరి ఫిర్యాదు మేరకు ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.