బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో నమోదైన ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్, ఫేక్ ఆధార్ కార్డ్ కేసులో రామచంద్ర భారతికి నాంపల్లి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. రూ.10 వేల నగదు చొప్పున రెండు పూచీకత్తులను సమర్పించాలని ఆదేశించింది నాంపల్లి కోర్టు. అలాగే నందకుమార్ కు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. దీంతో నందకుమార్ ను పోలీసులు చంచల్ గూడ జైలుకు తరలించారు.
కాగా టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితులైన రామచంద్ర భారతి, నందకుమార్ గురువారం ఉదయం చంచల్ గూడ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. వారిద్దరూ అలా విడుదలై బయటికి రాగానే బంజారాహిల్స్ టాస్క్ ఫోర్స్ పోలీసులు అరెస్ట్ చేశారు.
అనంతరం రామచంద్ర భారతి, నందకుమార్ లకు వైద్య పరీక్షలు నిర్వహించారు. షౌకత్ నగర్ పీహెచ్ సీలో వైద్యులు మెడికల్ టెస్టులు చేశారు. తర్వాత బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లి విచారణ జరిపారు.
రామచంద్ర భారతిపై ఫేక్ డ్రైవింగ్ లైసెన్స్, ఫేక్ ఆధార్ కార్డ్ కేసు నమోదవ్వగా.. నంద కుమార్ పై బంజారా హిల్స్ పీఎస్ లో చీటింగ్ కేసు ఫైల్ అయింది. ఈ కేసుల నేపథ్యంలో పోలీసులు బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లారు. విచారణ ముగిసిన తర్వాత నంద కుమార్, రామచంద్ర భారతి లను పోలీసులు నాంపల్లి కోర్టుకు తరలించారు.