టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ చేపట్టిన ‘యువగళం’ పాదయాత్రలో పాల్గొన్న సినీ నటుడు తారకరత్న సొమ్మసిల్లి పడిపోయాడు. దీంతో వెంటనే ఆయన్ని కుప్పంలోని కేసీ ఆస్పత్రికి తరలించారు. కుప్పం సమీపాన ఉన్న లక్ష్మీపురం శ్రీవరదరాజస్వామి ఆలయంలో ప్రత్యేక పూజల అనంతరం లోకేష్ పాదయాత్ర ప్రారంభమయ్యింది.
పాదయాత్ర మొదలయ్యాక కుప్పం సమీపంలోని ఓ మసీదులో లోకేష్ ప్రార్థన నిర్వహించగా తారకరత్న కూడా పాల్గొన్నారు. లోకేష్ మసీదు నుంచి బయటకు రాగానే ఒక్కసారిగా టీడీపీ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున తరలి రావడంతో వారి తాకిడికి తారకరత్న సొమ్మసిల్లి పడిపోయాడు.
ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని డాక్టర్లు తెలిపారు. కాగా విషయం తెలిసిన వెంటనే ఎమ్మెల్యే బాలకృష్ణ ఆస్పత్రికి చేరుకున్నారు. తారకరత్న ఆరోగ్య పరిస్థితి గురించి డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు.
అయితే కేసీ ఆస్పత్రిలో ప్రథమ చికిత్స అందించిన అనంతరం.. మెరుగైన వైద్యం కోసం తారకరత్నను పీసీఎస్ ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది.