‘ఛలో ఆత్మకూరు’ ఆందోళన కాదు గానీ, టీడీపీ కొత్త వివాదంలో పడింది. సాటి మహిళ అని కూడా చూకుండా టీడీపీ మహిళా నాయకురాలు దూషణకు దిగడంతో మహిళా ఎస్ఐ ఒకరు మనస్తాపం చెంది విధుల నుంచి వెళ్లిపోయారు. టీడీపీ అధినేత చంద్రబాబు నివాసం ముందు ఈ సంఘటన చోటుచేసుకుంది.
గుంటూరు: రాష్ట్ర మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ నన్నపనేని రాజకుమారి నోరు పారేసుకున్నారు. పాయకరావుపేట మాజీ ఎమ్మెల్యే వంగలపూడి అనిత తదితరులతో కలిసి ఆందోళన చేయడానికి వచ్చిన రాజకుమారి ఒక మహిళా పోలీస్ అధికారిని కులం పేరుతో దూషించారు. ‘దళితుల వల్లనే దరిద్రం’ అంటూ అక్కడే విధుల్లో ఉన్న దళిత మహిళా ఎస్ఐ అనురాధపై నన్నపనేని నోరు పారేసుకున్నారు. టీడీపీ నేతల వ్యాఖ్యలతో కలత చెందిన ఎస్ఐ అనురాధ అక్కడి నుంచి వెళ్లిపోయారు. ఎమ్మెల్యేగా, మహిళా కమిషన్ చైర్పర్సన్గా పనిచేసిన నన్నపనేని ఎలా మాట్లాడడం సరికాదని అన్నారు.
తమపై అనుచిత వ్యాఖ్యలు చేసిన టీడీపీ నాయకురాళ్లపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయనున్నట్టు చెప్పారు. అంతకుముందు చంద్రబాబు నివాసం దగ్గర టీడీపీ ఎమ్మెల్యే కింజరపు అచ్చెన్నాయుడు పోలీసు ఉన్నతాధికారిని దుర్భాషలాడారు. మాజీ మంత్రి భూమా అఖిలప్రియ కూడా మహిళా ఎస్ఐతో దురుసుగా ప్రవర్తించారని అంటున్నారు. ఇలావుంటే చంద్రబాబు నివాసం దగ్గర హల్చల్ చేసిన రాజకుమారి, అనితలను పోలీసులు అరెస్టు చేసి అక్కడి నుంచి తరలించారు.