విజయవాడ : టీడీపీ నేత చంద్రబాబునాయుడుపై సోషల్ మీడియాలో వైసీపీ ఫాన్స్ స్ప్రెడ్ చేస్తున్న ఒక మీమ్ నారా లోకేష్కి తీవ్ర ఆగ్రహం తెప్పించింది. సహనానికి కూడా ఒక హద్దు వుంటుందని.. ఇలాంటి నీచమైన పనులు చేస్తే ఎలా బుద్ది చెప్పాలో తెలుసునని వార్నింగ్ ఇచ్చారు. ట్విట్టర్లో లోకేశ్ ఇలా అన్నారు..
దొంగలు, అవినీతిపరులు, జైలుపక్షులూ అధికారంలోకి వస్తే సంస్కారహీనులు ఇలాగే రెచ్చిపోతారు. అనూ రాజేశ్వరి అనే తెదేపా కార్యకర్త, ఒక బీసీ మహిళ. ఆమె కొడుక్కి లుకేమియా వ్యాధి వస్తే మానవత్వంతో ఆదుకున్న చంద్రబాబుగారు ఆమె దృష్టిలో దైవంతో సమానం.
రాజేశ్వరి గారు చంద్రబాబు గారిని కలవడానికి వచ్చినప్పటి ఫోటోలను పెట్టి సోషల్ మీడియాలో ఇష్టం వచ్చినట్టు ప్రచారం చేశారు వైసీపీ వాళ్ళు. ఇక కామెంట్లు అయితే సభ్య సమాజం తలదించుకునేలా, అత్యంత జుగుప్సాకరంగా ఉన్నాయి.
జగన్ గారూ! ఒక బీసీ మహిళను నీచంగా అవమానించిన వారి అహంకారానికి పార్టీ పెద్దగా మీరు సమాధానం చెప్పాలి. తెదేపా కార్యకర్తలపై దాడులు చేశారు. ఆస్తులు కూల్చారు. ప్రాణాలు తీశారు. ఇప్పుడు ఇలాంటి నీచమైన చర్యలకు దిగారు.
ఇక మీ ఆగడాలు సహించేది లేదు. ఏ రకంగా మిమ్మల్ని కట్టడి చేయాలో మాకూ తెలుసు. న్యాయపరంగా, హక్కులపరంగా మీకు బుద్ధి చెప్పేవరకు పోరాడుతాం. ఖబడ్ధార్!