టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ జనవరి 27వ తేదీ నుంచి ఆంధ్ర ప్రదేశ్ లో ‘యువగళం’ పాదయాత్రకు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద ఆయన నివాళులర్పించారు. తెలంగాణకు చెందిన ముఖ్యనేతలతో కలిసి అక్కడికి చేరుకున్న లోకేష్.. తాత ఎన్టీఆర్ కు పుష్పాంజలి ఘటించారు.
ఎన్టీఆర్ ఘాట్ కు లోకేష్ వెళ్లే సమయంలో పెద్ద ఎత్తున యువత ద్విచక్ర వాహన ర్యాలీ నిర్వహించారు. మొదట ఇంటి వద్ద లోకేష్ తన తల్లిదండ్రులు చంద్రబాబు, భువనేశ్వరి, అత్తమామలు బాలకృష్ణ, వసుంధర ఆశీస్సులు తీసుకున్నారు.
అనంతరం ఆయన సతీమణి నారా బ్రహ్మణి హారతిచ్చారు. ఆ తర్వాత లోకేష్ ఎన్టీఆర్ ఘాట్ కు వెళ్లారు. బాలకృష్ణ దగ్గరుండి లోకేష్ ని కారు ఎక్కించారు. లోకేష్ రాకతో ఎన్టీఆర్ ఘాట్ కు వద్దకు పెద్ద ఎత్తున టీడీపీ కార్యకర్తలు, నేతలు చేరుకున్నారు.
అనంతరం ఎన్టీఆర్ ఘాట్ నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కు లోకేష్ చేరుకోనున్నారు. 3.30 గంటలకు శంషాబాద్ ఎయిర్ పోర్ట్ నుంచి కడపకు వెళ్లనున్నారు. కుప్పం నుంచి రాష్ట్ర వ్యాప్త ‘యువగళం’ పేరుతో పాదయాత్రకు నారా లోకేష్ రెడీ అవుతున్న విషయం తెలిసిందే.